కమలాన్ని కలవరపెడుతున్న కేసీఆర్!

ప్రేమిస్తే పోయేదేం లేదు.. మహా అయితే తిరిగి ప్రేమిస్తారు.. ఈ సినిమా డైలాగ్ గుర్తుందా.. మిర్చి సినిమాలో ప్రభాస్ చెబుతాడు. ఇపుడు రాజకీయాల్లో ఈ డైలాగ్ ను కేసీఆర్ ఫాలో అవుతున్నట్టున్నాడు. అదీ ఎందుకంటే.. కమలంపార్టీని తెలంగాణలో కలవరపెట్టేందుకే.. ఈనెల మొదటి వారంలో కేసీఆర్ ఢిల్లీ వెళ్లి వారం రోజులు ఉండి మోదీ, అమిత్ షా, ఇతర కేంద్ర పెద్దలను కలిసి వచ్చారు. పనిలోపనిగా యాదాద్రి ఆలయ మహోత్సవానికి రావాలని ప్రధాని మోదీని ఆహ్వానించారు.. తప్పకుండా వస్తానని మోదీ హామీ ఇచ్చారని టీఆర్ఎస్ లో టాక్.

అందుకే కేసీఆర్ ఈనెల 14వ తేదీన యాదాద్రికి వెళుతున్నారు.. అక్కడ ఐదారు గంటల పాటు ఉండి ఏర్పాట్లు పర్యవేక్షిస్తారట. అక్టోబర్ చివరి వారం లేదా నవంబర్ లో యాదాద్రి ఆలయ ప్రారంభోత్సవం అట్టహాసంగా చేయాలని సర్కారు నిర్ణయించింది. మోదీ కచ్చితంగా వస్తారని చెప్పినందువల్లే సీఎం ఇంత వేగంగా కదులుతున్నారని తెలిసింది. ఇదంతా నాణేనికి ఒకవైపు అయితే.. మరోవైపు కేసీఆర్ చర్యలతో కమలం నేతల్లో గుబులు పుట్టింది. అరె.. మేము ఇక్కడ ఇన్ని తిడుతున్నాం.. జైలుకు పంపుతాం.. అని బెదిరిస్తున్నాం.. ఈయనేమో అక్కడకు వెళ్లి మోదీతో మాటా.. మంతిలో పాల్గొంటున్నాడు. ఎన్ని తిట్టినా ఢిల్లీ సపోర్టు కేసీఆర్ కు ఉన్నపుడు ఏం ప్రయోజనమని వాపోతున్నారట. కేంద్రం పెద్దలు కూడా అనవసరంగా కేసీఆర్ తో గొడవలెందుకు అన్నట్లు ప్రవర్తిస్తోందని సమాచారం. ఎన్నికల అనంతరం ఎవరితో ఏ అవసరం వస్తుందో తెలియదు కదా అని బీజేపీ పెద్దల అభిప్రాయం.