తమిళ చిత్రసీమ మరో విషాద సంఘటనకు వేదికైంది. ప్రముఖ స్టంట్ మాస్టర్ ఎస్.ఎమ్.రాజు, సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. హీరో ఆర్య ప్రధాన పాత్రలో, పా.రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రంలో స్టంట్ కో-ఆర్డినేటర్గా పని చేస్తున్న రాజు, ఇటీవల జరిగిన షెడ్యూల్లో కార్ జంప్ స్టంట్ చేస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే, ఆ సీన్లో ఒక కారు గాలిలోకి లేపి, భద్రంగా ల్యాండ్ అవ్వాల్సింది. కానీ టెక్నికల్ లోపం కారణంగా కారు నియంత్రణ కోల్పోయింది. ప్రమాదం తీవ్రత అంతగా ఉండకపోవచ్చని భావించినా, కార్ బాడీకి తగిలిన షాక్ వల్ల రాజుకు తీవ్రమైన గాయాలు అయ్యి. ప్రాథమిక వైద్య సహాయం ఇచ్చేలోపే, ఆయన అక్కడికక్కడే మృతిచెందారు.
ఈ ఘటనపై సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తోంది. హీరో విశాల్, సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ, “రాజు చాలా కాలంగా మా ఇండస్ట్రీకి సేవలు అందించారు. నా పలు చిత్రాల్లో కూడా ఆయన పనిచేశారు. నిబద్ధత, ధైర్యం ఆయనకు ప్రత్యేకత. ఆయన మృతి నన్నెంతో బాధించింది. వారి కుటుంబానికి పూర్తి మద్దతు అందిస్తాను” అంటూ తన సంతాపం తెలిపారు. ప్రముఖ స్టంట్ కొరియోగ్రాఫర్ సిల్వా కూడా భావోద్వేగంతో స్పందించారు. “ఈ ఘోరమైన సంఘటన చిత్ర పరిశ్రమకు తీరని లోటు. మా స్టంట్ ఫ్రాటర్నిటీ ఓ అసాధారణ టాలెంట్ను కోల్పోయింది,” అని పేర్కొన్నారు.
అయితే దర్శకుడు పా.రంజిత్, హీరో ఆర్య ఇప్పటివరకు ఈ ఘటనపై ఎటువంటి అధికారిక ప్రకటన ఇవ్వకపోవడం నెటిజన్లలో అసంతృప్తిని కలిగిస్తోంది. సినిమాకు పని చేస్తూ ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి విషయంలో కనీసం స్పందించకపోవడం బాధాకరమని పలువురు అభిప్రాయపడుతున్నారు . ఎస్.ఎమ్.రాజు అనేక తమిళ, తెలుగు చిత్రాల్లో స్టంట్ మాస్టర్గా పనిచేశారు. స్టార్ హీరోల సినిమాల్లో రిస్కీ స్టంట్లు తెరకెక్కించిన రాజు, తన పనిపై నిబద్ధతకు పేరుగాంచారు. ఈ ఘటన సినిమా సెట్స్లో సేఫ్టీ ప్రొటోకాల్లు పట్ల మరింత జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరాన్ని మరోసారి గుర్తు చేస్తోంది. ఇది కేవలం ఓ ప్రమాదం కాదు – ఓ జీవితానికే ముగింపు.