ఎన్నో వందల సినిమాల్లో తన నటనతో కడుపుబ్బ నవ్వించిన సీనియర్ కమెడియన్ విశ్వేశ్వర్ రావు (62) అనారోగ్యంతో ఇటీవల కన్నుమూశాడు. ఆంధ్రాలో పుట్టిన ఆయన తమిళనాడులోని చెన్నైలో స్థిరపడ్డాడు. చెన్నైలోని సిరుశేరులోని నివాసంలో మంగళవారం తెల్లవారుజామున తీవ్ర అనారోగ్యంతో మృతి చెందారు. విశ్వేశ్వర్ రావు మరణంతో ఇండస్ట్రీలో కమెడియన్లతోపాటు ఇతర సినీ ప్రముఖులంతా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అతడి మృతికి సంతాపం తెలియజేశారు. కొందరు సెలబ్రిటీస్ అతడి నివాసానికి చేరుకుని అంజలి ఘటించారు. ఆరోజు సాయంత్రం అతడి అంత్యక్రియలు జరిగినట్లు తెలుస్తుంది. కాగా ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఆంధ్రప్రదేశ్లోని కాకినాడలో జన్మించిన విశ్వేశ్వరరావు చిన్నప్పటినుంచే సినిమాల్లో నటించడం మొదటుపెట్టాడు. చైల్డ్ ఆర్టిస్ట్గా దాదాపు 150 సినిమాల్లో నటించిన ఆయన తెలుగు, తమిళ సినిమాల్లో కమెడియన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన ఇప్పటివరకు 350కు పైగా సినిమాల్లో నటించి ప్రేక్షకులో నవ్వులు పూయించాడు. పాత తరం నుంచి నేటితరం హీరోహీరోయిన్లవరకు దాదాపు అందరితో ఆయన కలిసి నటించడం విశేషం. సీనియర్ ఎన్టీఆర్, ఎంజీఆర్, జయలలిత, చిరంజీవి, రజనీకాంత్, నాగార్జున, పవన్కల్యాణ్ తదితర స్టార్ హీరోలతో కలిసి పని చేశాడు.
కొన్ని సినిమాలతో విశ్వేశ్వరరావుకు మంచి గుర్తింపు వచ్చింది. ఆమెకథ, ముఠామేస్త్రీ, బిగ్బాస్, ప్రెసిడెంట్ గారి పెళ్లాం, ఆయనకు ఇద్దరు, ఇక్కడ అమ్మాయి అక్కడ అబ్బాయి, మెకానిక్ అల్లుడు, శివపుత్రుడు, శివాజీ తదితర సినిమాల్లో విశ్వేశ్వరరావు కీలక పాత్రలో మెపించాడు. నటుడిగా కొనసాగుతూనే దర్శకుడిగా, నిర్మాతగాను విశ్వేశ్వరరావు రాణించాడు. అనారోగ్యం కారణంగానే సినిమాలకు దూరమైన ఆయన యూట్యూబ్ చానల్ నిర్వహిస్తున్నాడు. విస్సు టాకీస్ పేరుతో యూట్యూబ్ నిర్వహిస్తున్న విశ్వేశ్వరరావు కేవలం తమిళంలో మాత్రమే వీడియోలు చేస్తున్నాడు. తెలుగులో కన్నా ఆయనకు తమిళంలో మంచి గుర్తింపు లభించింది.