ఉమ్మడి ప్రకాశం జిల్లాలో చక్రం తిప్పిన వైసీపీ కీలకనాయకుడు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్థానంలో కొత్త ముఖానికి చోటుకల్పిస్తున్నారా? ఆయనను తప్పించే ప్రయత్నం చేస్తున్నారా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. పార్టీ అధిష్టానం అప్పగించిన ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల కో-ఆర్డినేటర్గా బాలినేని రాజీనామా చేయడం అప్పట్లో పెను సంచలనమే అయ్యింది. ఆ మధ్య ఆయనకు మళ్లీ మునుపటి రోజులొచ్చాయని.. ఇక అన్నీ బాగానే ఉన్నాయనే ప్రచారం కూడా జరిగింది.
అయితే, ఆ ప్రచారం మాట ఎలా ఉన్నప్పటికీ.. తర్వాత బాలినేని ఫ్లెక్సీలో వైఎస్ జగన్తో పాటు జిల్లా మంత్రులు ఎవరి ఫొటోలు కనిపించపోవడం.. కార్యకర్తలను జగన్ సరిగ్గా పట్టించుకోవట్లేదని ఆరోపణలు చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. దీంతో బాలినేని ఇంకా కూల్ అవ్వలేదని ఆయన అనుచరులు చెబుతున్నారు. ఇదిలావుంటే, బాలినేని రాజీనామా చేసిన కో-ఆర్డినేటర్ పదవికి వైసీపీ కీలక నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిని సెలక్ట్ చేసినట్లు సమాచారం. వైఎస్ జగన్ నమ్మే అతి కొద్ది మందిలో సాయిరెడ్డి కీలకమనే విషయం అందరికీ తెలిసిందే.
ఎలాంటి నేతల మధ్య విబేధాలున్నా ఒకట్రెండు సమావేశాలతోనే కలిపేసే సత్తా ఉన్న నేతగా సాయిరెడ్డి పేరు తెచ్చుకున్నారు. అందుకే ఈయనైతేనే ఈ మూడు జిల్లాల ఎమ్మెల్యేలు, ద్వితియ శ్రేణి నేతలను సమన్వయం చేసుకోగలరని సీఎం విశ్వసిస్తున్నా రని సమాచారం. ఇప్పటికే వైసీపీలోని పెద్దలతో జగన్ ఇదే విషయం చర్చించినట్లుగా తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే అటు విజయసాయికి సమాచారం ఇవ్వడం.. ఇటు అధికారిక ప్రకటన రెండూ ఒకే రోజు జరిగిపోతాయని అంటున్నారు.
మరోవైపు.. తాను ఒంగోలు నియోజకవర్గానికే పరిమితం అవుతానని చెప్పిన బాలినేని.. ఈ విషయంలో సీఎం జగన్ చెప్పినా.. వెనక్కి తగ్గకపోవడంతో ఆయనకు పార్టీలోను.. అధినేత వద్ద కూడా ప్రాధాన్యం తగ్గిపోయినట్టు తెలుస్తోంది. ఎప్పటికప్పుడు సీఎం జగన్కు టచ్లో ఉండే నేతలపై బాలినేని ఆగ్రహంతో ఉన్నారని.. ఇప్పటి వరకు తెలిసిందే. అయితే.. జగన్ వారికే ప్రాధాన్యం ఇస్తుండడం.. బాలినేనిని బుజ్జగిస్తారని అనుకున్నా.. అనుకున్న విధంగా ఆయనను బుజ్జగించకపోవడం తెలిసిందే. మొత్తంగా చూస్తే.. బాలినేని పరిస్థితి ఒంటరిగా మారిపోయే పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు.