సాధారణంగా ఒకనాయకుడి గురించి ప్రత్యర్థి పార్టీలు రాజకీయాలు చేయడం సహజమే. దీనిని ఎవరూ కాదనరు. పాలన పరంగా కానీ.. పార్టీ పరంగా కానీ.. ఇతరత్రా విధానాల పరంగా కానీ.. నాయకులపై ప్రత్యర్థులు విరుచుకుపడడం.. సవాళ్లురువ్వడం.. సహజమే. ఏపీలోకి వచ్చేసరికి.. అధికార వైసీపీ నాయకుడు, సీఎం జగన్పై ప్రతిపక్షం టీడీపీ నాయకులు కూడా ఇదే తరహాలో రాకీయాలు చేస్తున్నారు. ఆయన విధానాలను.. ఎండగడుతున్నారు. ఆయన రాజకీయాలను ప్రశ్నిస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. తాజాగా జగన్ ధరించే చెప్పుల పైనా టీడీపీ నాయకులు రాజకీయం చేయడం సంచలనంగా మారింది.
ఒకప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న జయలలితపై ప్రతిపక్షాలు ఇలానే విమర్శలు చేసేవి. ఆయన ధరించే చీరల నుంచి వేసుకునే చెప్పుల వరకు అన్నీ విమర్శలకు కేంద్రాలుగా మారాయి. అలానే.. ఇప్పుడు సీఎం జగన్ విషయంలోనూ ఆయన ధరించే బట్టలను వదిలేసినా.. ఆయన వేసుకుంటున్న చెప్పుల విషయం ఇప్పుడు పెద్ద ఎత్తున రాజకీయంగా మారింది. జగన్ ఇంత ఖరీదు చెప్పులు వేసుకుంటారు.. అంటూ.. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ వస్తున్నాయి. నిజానికి సీఎం జగన్ ఎప్పుడూ.. షూ ధరించలేదు. ఆయన ఎక్కడకు వెళ్లినా చెప్పులతోనే ఉంటారు.
చివరకు ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయినప్పుడు కూడా సీఎం జగన్ చెప్పులతోనే ఉంటారు. కానీ… ఇప్పటి వరకు ఈ విషయంపై ఎవరూ పెద్దగా దృష్టి పెట్టలేదు. కానీ.. తాజాగా టీడీపీ నాయకులు చెప్పుల విషయాన్ని చర్చకు పెట్టారు. సీఎం జగన్ వేసుకునే చెప్పుల ధరను వారు ప్రశ్నిస్తున్నారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ దేశంలోనే సంపన్న సీఎంల్లో ఒకరు కావడంతో ఆయన స్థాయికి తగ్గట్టుగా లక్ష రూపాయల విలువైన చెప్పులు వాడుతున్నారని టీడీపీ ఎద్దేవా చేసింది. ఏపీ సీఎం జగన్ రెడ్డి చెప్పుల విలువ అక్షరాలా 1,34,800 రూపాయలుగా ఉందని టీడీపీ నేతలు వ్యాఖ్యలు చేస్తుండడం గమనార్హం.
ఏపీలో అప్పుడే ఎన్నికలొచ్చేశాయనే రీతిలో టీడీపీ, వైసీపీ మధ్య సోషల్ మీడియాలో వార్ నడుస్తోంది. అందివచ్చిన ఏ అవకాశాన్ని రెండు పార్టీలు వదిలిపెట్టడం లేదు. సోషల్ మీడియాలో పోస్టులతో హోరెత్తిస్తున్నాయి. తాజాగా.. టీడీపీ సోషల్ మీడియా విభాగం కూడా జగన్ చెప్పుల విలువను హైలైట్ చేస్తూ పోస్టులతో విమర్శలు గుప్పిస్తోంది. ఈ విమర్శలకు వైసీపీ నాయకులు ఇంకా రియాక్ట్ కాలేదు. మరి వారెలా స్పందిస్తారో చూడాలి. గతంలో చంద్రబాబు తాగే వాటర్బాటిల్పై వైసీపీ నేతలు విమర్శలు చేసిన విషయం ప్రస్తావనార్హం.