ప్రియాంకతో రేవంత్ స్కెచ్..హామీల వర్షం..కాంగ్రెస్‌కు కలిసొస్తుందా?

మొత్తానికి ప్రియాంక గాంధీ..తెలంగాణ రాజకీయాలపై ఫోకస్ పెట్టారు. గత కొన్ని రోజుల నుంచి ఆమె..తెలంగాణపై ఫోకస్ పెట్టిన విషయం తెలిసిందే. అక్కడ నేతలకు దిశానిర్దేశం చేస్తూ వస్తున్నారు. అయితే ప్రత్యక్షంగా ఆమె తెలంగాణలో ఎంట్రీ ఇవ్వలేదు. తాజాగా నిరుద్యోగ సంఘర్షణ పేరిట భారీ సభ నిర్వహించగా ఆ సభలో ప్రియాంక పాల్గొన్నారు. ఈ క్రమంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలని దృష్టిలో పెట్టుకుని కీలక హామీలని ఇచ్చారు.

ముఖ్యంగా నిరుద్యోగ యువతని ఆకట్టుకునేలా హామీలు ఇచ్చారు. అయితే తెలంగాణ వచ్చాక పెద్దగా న్యాయం జరగని వర్గం ఏదైనా ఉందంటే..అది నిరుద్యోగ వర్గమే. ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడిందే వాళ్ళు..అయినా వారిని కే‌సి‌ఆర్ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇప్పుడు ఎన్నికల సమయంలో నిదానంగా నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నారు. అయినా వారు కే‌సి‌ఆర్ ప్రభుత్వంపై అసంతృప్తిగానే ఉన్నారు. ఈ క్రమంలో వారిని కాంగ్రెస్ వైపుకు తిప్పడమే లక్ష్యంగా ప్లాన్ చేశారు. వారికి కీలక హామీలు ఇచ్చారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణ కోసం పోరాడిన వారిని స్వాతంత్ర సమరయోధులుగా గుర్తిస్తామని, వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, 25 వేల రూపాయల గౌరవ పెన్షన్ ఇస్తామని, అలాగే తెలంగాణ సమరయోధులపై ఉన్న అక్రమ కేసులను ఎత్తివేస్తామని రేవంత్ రెడ్డి అన్నారు. ఇక నిరుద్యోగులకు 4,000 రూపాయల భృతి ఇస్తామని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు.

ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని, జూన్ 2వ తేదీన నోటిఫికేషన్ ఇచ్చి, సెప్టెంబరులో నియామక పత్రాలు అందజేస్తామని, ఇక ప్రైవేటు కంపెనీలలో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే కల్పిస్తామని, నిరుద్యోగ యువతకు వడ్డీలేని 10 లక్షల రూపాయల రుణాన్ని ఇస్తామని అదిరిపోయే హామీలు ఇచ్చారు. అలాగే ప్రియాంక చేత ఈ హామీలని ప్రకటించేలా చేశారు. అదే సమయంలో నెక్స్ట్ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రియాంకని తెలంగాణ నుంచి పోటీ చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది.