నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్ లో `పుష్ప 2` ఒకటి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో రూపుదిద్దుకున్న `పుష్ప ది రైజ్` పాన్ ఇండియా స్థాయిలో సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా `పుష్ప ది రూల్` టైటిల్ తో పార్ట్ 2 తెరకెక్కుతోంది. ఇందులో అల్లు అర్జున్ కు భార్యగా రష్మిక కనిపించబోతోంది.
ఈ చిత్రంలో రష్మిక చనిపోయినట్లు ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇందుకు కారణం లేకపోలేదు. తాజాగా పుష్ప2 షూటింగ్ కి సంబందించిన రా వీడియో అంటూ ఒక ఫోటో సోషల్ మీడియాలో లీక్ అయింది. రష్మిక చనిపోయిన లుక్ లో ఆ పిక్ ఉండటంతో.. అది కాస్తా పుష్ప 2కి సంబందించింది అంటూ ప్రచారం ఊపందుకుంది.
పుష్ప 2లో రష్మిక పాత్ర చనిపోతుందని జోరుగా వార్తలు వచ్చాయి. కానీ, చనిపోయింది రష్మిక కాదు. అసలు ఈ పిక్ `పుష్ప 2`కు సంబంధించే కాదు. 2020లో విడుదలైన `నయ్ వరణ్ భట్ లోంచా కోన్ నాయ్ కొంచా` అనే మరాఠీ సినిమాలోని పిక్ ఇది. ఇందులో హీరోయిన్ అశ్విని కులకర్ణి కాస్త రష్మికను పోలి ఉంటుంది. ఆ సినిమాలో ఆమె పాత్ర చనిపోతోంది. అందుకే సంబంధించిన పిక్ నే సోషల్ మీడియాలో షేర్ చేసి పుష్ప 2 సినిమాలోనిది అంటూ ప్రచారం చేస్తున్నారు. అదన్నమాట సంగతి.