హైద‌రాబాద్‌లో `ఆర్ఆర్ఆర్` ప్రీ రిలీజ్ ఈవెంట్‌.. గెస్ట్‌లు ఎవ‌రో తెలుసా?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన తాజా చిత్రం `ఆర్ఆర్ఆర్‌`. ఈ పాన్ ఇండియా చిత్రంలో చెర్రీకి జోడిగా బాలీవుడ్ బ్యూటీ ఆలియాభట్‌, తారక్‌ సరసన హాలీవుడ్‌ నటి ఒలీవియా మోరీస్‌ నటించారు. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో అజ‌య్ దేవ్గ‌న్‌, శ్రీయ‌లు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు.

ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలో జోరుగా ప్ర‌మోష‌న్స్ నిర్వ‌హిస్తున్న చిత్ర యూనిట్‌.. ఇటీవ‌ల ముంబైలో గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వ‌హించింది. ఈ ఈవెంట్‌కు స‌ల్మాన్ ఖాన్ స్పెష‌ల్ గెస్ట్‌గా వ‌చ్చిన సినిమాపై భారీ హైప్‌ను క్రియేట్ చేశారు.

అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక‌ను త్వ‌ర‌లోనే హైద‌రాబాద్‌లోనూ నిర్వ‌హించ‌బోతున్నారు. ఈ ఈవెంట్‌కి టాలీవుడ్ సీనియ‌ర్ స్టార్ హీరోలైన నంద‌మూరి బాల‌కృష్ణ‌, మెగాస్టార్ చిరంజీవిలు చీఫ్ గెస్ట్‌లుగా రానున్నార‌ని తెలుస్తోంది. దీనిపై ఎటువంటి అధికారిక ప్ర‌క‌ట‌న లేన‌ప్ప‌టికీ.. ఈ వార్త సోష‌ల్ మీడియాలో మాత్రం తెగ చ‌క్క‌ర్లు కొట్టేస్తోంది.

కాగా, భారత్ లోనే అతిపెద్ద డ్రామా యాక్షన్ చిత్రంగా రూపుదిద్దుకున్న ఆర్ఆర్ఆర్ లో అల్లూరి సీత‌రామ‌రాజు రామ్ చ‌ర‌న్‌, కొమ‌రం భీమ్‌గా ఎన్టీఆర్‌లు క‌నిపించ‌బోతున్నారు. అలాగే ఎం. ఎం. కీరవాణి సంగీతం అందించిన ఈ చిత్రాన్ని డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై డివివి దాన‌య్య భారీ బ‌డ్జెట్‌తో నిర్మించారు.