న్యాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్ కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం `శ్యామ్ సింగరాయ్`. కలకత్తా బ్యాక్డ్రాప్లో పిరియాడికల్ పవర్ఫుల్ యాక్షన్ డ్రామాగా రూపుదిద్దుకున్న ఈ మూవీలో సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటించారు.
అలాగే నిహారిక ఎంటర్టైన్మెంట్ పతాకంపై వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 24న తెలుగుతో పాటు తమిళ్, మలయాళం మరియు కన్నడ భాషల్లో గ్రాండ్గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ షురూ చేసిన చిత్ర యూనిట్.. తాజాగా `శ్యామ్ సింగరాయ్` టీజర్ను వదిలింది.
`అడిగే అండ లేదు..కలబడే కండ లేదని.. రక్షించాల్సిన దేవుడే రాక్షసుడిగా మారుతుంటే.. కాగితం కడుపు చీల్చుకు పుట్టి రాయడమే కాదు కాలరాయడం కూడా తెలుసని.. అక్షరం పట్టుకున్న ఆయుధం పేరే..` అంటూ ప్రారంభమైన ఈ టీజర్ ఆద్యంతం ఆకట్టుకోవడమే కాదు.. గూస్ బంప్స్ వచ్చేలా చేసింది. `స్త్రీ ఎవ్వరికీ దాసి కాదు. ఆఖరికి దేవుడికి కూడా. ఖబడ్దార్` అంటూ శ్యామ్సింగారాయ్ పాత్రలో నాని చెప్పే డైలాగ్ ఆలోచింపజేస్తోంది.
నాని ఈ మూవీలో రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నాడు. అందులో ఆచారాల పేరుతో స్త్రీలకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదురించి, ప్రజల తరపున పోరాడే శ్యామ్ పాత్ర ఒకటి కాగా..మోడరన్ యువకుడు వాసు పాత్ర మరొకటి అని టీజర్ బట్టీ అర్థం అవుతోంది. ఇక టీజర్లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. మొత్తానికి అదిరిపోయిన తాజా టీజర్ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేసింది.