మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన తాజా చిత్రం `ఆచార్య`. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, పూజా హెగ్డేలు హీరోయిన్లుగా నటించారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మితమైన ఈ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న విడుదల కానుంది.
ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో రామ్ చరణ్ `సిద్ధ` అనే పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా సిద్ధ పాత్రకు సంబంధించిన టీజర్ ను మేకర్స్ విడుదల చేశారు. ధర్మస్థలిని కాపాడుకునే వ్యక్తిగా రామ్ చరణ్ సిద్ద పాత్రలో కనిపించబోతున్నాడని టీజర్ బట్టీ అర్థం అవుతుండగా.. ఆయన గెటప్, నటన అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి.
అలాగే ‘ధర్మస్థలికి ఆపదొస్తే.. అది జయించడానికి అమ్మోరుతల్లి మాలో ఆవహించి ముందుకు పంపుతుంది’ అంటూ చరణ్ పలికిన డైలాగ్స్ ఫ్యాన్స్ చేత విజిల్స్ వేయిస్తున్నాయి. విజువల్స్ మరియు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా గ్రాండ్గా ఉన్నాయి. ఇక చివరిగా చిరుతపులి మరియు చిరుత పిల్ల వాగుకు అటు వైపు ఉండగా.. మరో వైపు చరణ్ మరియు చిరంజీవి ని చూపించిన షాట్ మెగా ఫ్యాన్స్కి సూపర్ కిక్ ఇచ్చింది.
మొత్తానికి అదిరిపోయిన సిద్ధ టీజర్ ప్రస్తుతం యూట్యూబ్లో ట్రెండింగ్గా మారింది. కాగా, దేవాదాయ శాఖకు సంబంధించిన కథాంశంతో రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రం మే నెలలోనే విడుదల కావాల్సి ఉన్నా కరోనా కారణంగా వాయిదా పడింది.