అక్కినేని యువ సామ్రాట్ నాగ చైతన్య, ఫిదా భామ సాయి పల్లవి జంటగా నటించిన తాజా చిత్రం `లవ్ స్టోరీ`. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్లో శ్రీ నారాయణదాస్ నారంగ్ & శ్రీ పి. రామ్ మోహన్ రావు నిర్మించారు. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్లోనే విడుదల కావాల్సి ఉంది.
కానీ, కరోనా కారణంగా విడుదల ఆలస్యమవుతూ వస్తోంది. ఇక ఈ మోస్ట్ అవైటెడ్ సినిమాను వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 10కి విడుదల చేయబోతున్నట్టు ఇటీవల మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ తేదీకే మరిన్ని సినిమాలు ఇటు థియేటర్లో, అటు ఓటీటీలో విడుదలకు సిద్ధం అయ్యాయి.
అలాగే ఏపీలో సెకండ్ షోపైన, టికెట్ ధరలపైన జగన్ సర్కార్ ఓ నిర్ణయం తీసుకుంటుందని ఊహించారంతా. కానీ అలా ఏమి జరగలేదు. ఈ నేపథ్యంలోనే సెప్టెంబర్ 10కి కూడా లవ్ స్టోరీ విడుదల అయ్యే పరిస్థితి లేదని, మళ్లీ సినిమా వాయిదా పడ్డట్టే అని బలంగా టాక్ వినిపిస్తోంది. అంతేకాదు, సెప్టెంబర్ 24న కానీ 30న కానీ లవ్ స్టోరీని విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. మరి ఇది ఎంత వరకు నిజమో తెలియాలంటే అధికారిక ప్రకటన రావాల్సిందే.