అందరూ జక్కన్న అని ముద్దుగా పిలుచుకునే దర్శకధీరుడు రాజమౌళి.. తన మూవీకి తానే స్పెషల్ గెస్ట్ అవుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ప్రభాస్ హీరోగా రాజమౌళి తెరకెక్కించిన ఛత్రపతి బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. 2005 విడుదలైన ఈ చిత్రాన్ని ఇప్పుడు బాలీవుడ్లో రీమేక్ చేస్తున్నారు.
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో ఈ హిందీ రీమేక్ చిత్రం తెరకెక్కనుంది. బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ పతాకంపై జయంతిలాల్ గడ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. షూటింగ్ ఇప్పటికే స్టార్ట్ కావాల్సి ఉన్నా.. కరోనా కారణంగా ఆలస్యం అవుతూ వచ్చింది.
అయితే జూలై 16న ఛత్రపతి హిందీ రీమేక్ను ఘనంగా ప్రారంభించబోతున్నారు. ఈ ప్రారంభోత్సవానికి రాజమౌళిని స్పెషల్ గెస్ట్గా ఆహ్వానించినట్టు తెలుస్తోంది. అలాగే స్టార్ ప్రొడ్యూసర్ ఏ.ఎం.రత్నం మరియు పలువురు సినీ ప్రముఖులు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేయనున్నారని తెలుస్తోంది.