త‌న మూవీకి తానే స్పెష‌ల్ గెస్ట్ అవుతున్న జ‌క్క‌న్న‌?!

అంద‌రూ జక్క‌న్న అని ముద్దుగా పిలుచుకునే ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి.. త‌న మూవీకి తానే స్పెష‌ల్ గెస్ట్ అవుతున్నారు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. ప్ర‌భాస్ హీరోగా రాజ‌మౌళి తెర‌కెక్కించిన ఛత్రపతి బ్లాక్ బస్ట‌ర్ హిట్ అయిన సంగ‌తి తెలిసిందే. 2005 విడుదలైన ఈ చిత్రాన్ని ఇప్పుడు బాలీవుడ్‌లో రీమేక్ చేస్తున్నారు.

బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్ హీరోగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో ఈ హిందీ రీమేక్ చిత్రం తెర‌కెక్క‌నుంది. బాలీవుడ్‌ ప్రముఖ నిర్మాణ సంస్థ పెన్‌ స్టూడియోస్ ప‌తాకంపై జ‌యంతిలాల్ గ‌డ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. షూటింగ్ ఇప్ప‌టికే స్టార్ట్ కావాల్సి ఉన్నా.. క‌రోనా కార‌ణంగా ఆల‌స్యం అవుతూ వ‌చ్చింది.

అయితే జూలై 16న ఛత్రపతి హిందీ రీమేక్‌ను ఘనంగా ప్రారంభించబోతున్నారు. ఈ ప్రారంభోత్సవానికి రాజ‌మౌళిని స్పెష‌ల్ గెస్ట్‌గా ఆహ్వానించిన‌ట్టు తెలుస్తోంది. అలాగే స్టార్ ప్రొడ్యూసర్ ఏ.ఎం.రత్నం మ‌రియు పలువురు సినీ ప్రముఖులు కూడా ఈ కార్య‌క్ర‌మానికి విచ్చేయనున్నారని తెలుస్తోంది.