కాషాయదళంలో కరోనా మహమ్మారి కల్లోలం రేపుతున్నది. ఇప్పటికే పలువురు సీనియర్, జాతీయ స్థాయి నేతలు, కేంద్ర మంత్రులు సైతం వైరస్ బారిన పడ్డారు. అందులో కొందరు కోలుకోగా, మరికొందరు ప్రాణాలను విడిచారు. ఇప్పుడు తాజాగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర కోశాధికారి భవర్ లాల్ వర్మ శనివారం ఉదయం 7 గంటల 30 నిమిషాలకు సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కరోనా బారిన పడి ఫిబ్రవరి 28న సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్ లో చేరారు. అయితే కరోనా తో పాటు నిమోనియా వ్యాధి కూడా చేకూరడంతో ఆరోగ్యం క్షీణించి శనివారం ఉదయం మృతి చెందినట్లు కిమ్స్ వైద్యులు తెలిపారు. ఇక సనత్ నగర్ నియోజకవర్గ మొండా డివిజన్ ప్రాంతానికి చెందిన వర్మ చాలా కాలం పాటు బీజేపీలో పని చేస్తుండడంతో పాటు, 2002 లో మొండా డివిజన్ బీజేపీ కార్పొరేటర్ గా గెలుపొందారు. వర్మ కి నలుగురు కూతుళ్లు ఒక కుమారుడున్నాడు.
ఇదిలా ఉండగా ఒకప్పటి టీడీపీ సీనియర్ నాయకుడు, ప్రస్తుత బీజేపీ నేత, మాజీమంత్రి మోత్కుపల్లి నర్సింహులు ఆరోగ్యం విషమంగా మారింది. కొద్దిరోజుల క్రితం ఆయన కరోనా బారినపడ్డారు. అప్పటి నుంచి కరోనా చికిత్స పొందుతున్న ఆయనకు శనివారం అర్ధరాత్రి శ్వాస తీసుకోవడంలో సమస్యలు ఏర్పడ్డాయి. కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను సోమాజిగూడ యశోద ఆసుపత్రికి తరలించారు. మోత్కుపల్లి హెల్త్ కండీషన్ సీరియస్గా ఉండడంతో వైద్యులు ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం విషమంగానే ఉందని వైద్యులు పేర్కొన్నారు. మోత్కుపల్లి ఆరోగ్య పరిస్థితిపై కుటుంబసభ్యులు, పార్టీ శ్రేణులు, అభిమానుల్లో ఆందోళన నెలకొంది.