వైసీపీ ఫైర్ బ్రాండ్‌ రోజాకి ఏమైంది..!

అసెంబ్లీ స‌మావేశాల్లో ప్ర‌తిప‌క్ష ఎమ్మెల్యే రోజా ఎప్పుడూ హైలైట్‌గా నిలుస్తారు!! గ‌త అసెంబ్లీ స‌మావేశాల్లో ఆమె చేసిన గ‌లాటా ఎవ‌రూ మ‌రిచిపోయి ఉండ‌రు! కానీ కొత్త అసెంబ్లీలో ఆమె మ‌రింత కొత్త‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అస‌లు మాట్లాడ‌ట‌మే మానేశారు! ఎదురుదాడికి దిగ‌డంలేదు! ప‌క్క నుంచి సెటైర్లు వేయ‌డం లేదు! ర‌క‌రకాల హావ‌భావాలు ఆమె మోములో క‌నిపించ‌డం లేదు! తొలిరోజు అసెంబ్లీలో రోజా వెనక సీట్లో కూర్చోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఎందుకీ వింత ప్ర‌వ‌ర్త‌న‌.. అంటే దీని వెనుక పెద్ద స్కెచ్ దాగి ఉంద‌ట‌!

రోజా అసెంబ్లీకి వస్తే పరిస్థితి మామూలుగా ఉండదు. వైసీపీ ఎమ్మెల్యేలతో ముచ్చట్లు.. టీడీపీపై సెటైర్లు వేసుకుంటూ లాబీల్లో కనిపిస్తుంటారు. ఇక అసెంబ్లీలోనూ నిత్యం ఆమె గొంతు వినిపిస్తూ ఉంటుంది. ఎమ్మెల్యేలు, మంత్రులు.. చివరికి ముఖ్యమంత్రి మాట్లాడుతున్నా… రోజా రన్నింగ్ కామెంట్రీ వినిపించడం మామూలే. కానీ కొత్త అసెంబ్లీలో మాత్రం అలాంటి సీన్ లేవీ కనిపించలేదు. తొలిరోజు అసెంబ్లీకి వచ్చిన రోజా … చాలా కామ్ గా కనిపించారు. అసెంబ్లీ లాబీల్లోనూ నోరెత్తలేదు.

నాయకులకు అభివాదం చేస్తూ వచ్చీ రాగానే వెనక సీట్లలోకి వెళ్లి కూర్చున్నారు. ఇక గవర్నర్ ధన్యవాద ప్రసంగం సమయంలోనూ శ్రద్ధగా ఆలకించారు. ఆ తర్వాత ఆమె సైలెంట్ గానే వెళ్లిపోయారు. రోజా మౌనం వెనక అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గ‌త అసెంబ్లీ స‌మావేశాల్లో ఆమె ప్ర‌వ‌ర్త‌నకు గాను ఏడాది పాటు నిషేధాన్ని ఎదుర్కొన్నారు. ఇప్పుడు ఆ నిషేధాన్ని పొడిగించే అవ‌కాశాలున్నాయ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

దీంతో ఆ వేటును తప్పించుకునేందుకే ఇలా చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఇప్ప‌టికే ఏడాది పాటు బ్యాన్ ను ఎదుర్కొన్నారు.. కాబట్టి మరోసారి ఆ పరిస్థితి తెచ్చుకోకుండా సైలెంట్ గా ఉండాలని నిర్ణయించుకుని ఇలా ప్ర‌వ‌ర్తిస్తున్నారేమో అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా ఎప్పుడూ గలగల మాట్లాడే రోజా.. ఇలా సైలెంట్ కావడం మాత్రం చర్చనీయాంశంగా మారింది. ఇటీవ‌ల మ‌హిళా పార్ల‌మెంటేరియ‌న్ల స‌ద‌స్సుకి రానివ్వ‌కుండా అడ్డుకోవ‌డంతో స్పీకర్ కోడెల‌, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుపై ఆమె ఫైర్ అయిన విష‌యం తెలిసిందే!!