పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పొడుగు కాళ్ల సుందరి పూజా హెగ్డే తొలిసారి జంటగా నటించిన తాజా చిత్రం `రాధేశ్యామ్`. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వ వహించిన ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, టీ-సిరీస్ బ్యానర్లపై భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్, ప్రసీదాలు సంయుక్తంగా నిర్మించారు. అలాగే సౌత్ లాంగ్వేజ్ సాంగ్స్ కు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తుండగా… హిందీ పాటలకు మిథున్, అనూ మాలిక్, మనన్ భరద్వాజ్ బాణీలు అందిస్తున్నారు.
ఇటీవలె షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14న తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్గా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్న చిత్ర యూనిట్.. ఒక్కో అప్డేట్ను వదులుతూ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేస్తున్నారు.
ఇందులో భాగంగానే రాధేశ్యామ్ నుంచి మూడో సాంగ్ `సంచారి..` ప్రోమోను తాజాగా మేకర్స్ విడుదల చేశాడు. `చల్.. చలో.. సంచారి.. చల్ చలో.. కొత్త నేలపై` అంటూ సాగిన ఈ సంగ్కి కృష్ణకాంత్ (కెకె) సాహిత్యం అందించగా.. అనిరుధ్ రవిచందర్ ఆలపించారు. ప్రేమనే గమ్యస్థానంగా ఎంచుకుని ప్రభాస్ చేసే ప్రయాణాన్ని ఈ టీజర్ లో చూడొచ్చు. మొత్తానికి అదిరిపోయిన `సంచారి` సాంగ్ టీజర్ నెట్టంట వైరల్గా మారింది.
ఇక `సంచారి` ఫుల్ లిరికల్ సాంగ్ ను డిసెంబర్ 16 గురువారం విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కాగా, 1970లో యూరప్ నేపథ్యంగా సాగే ప్రేమకథా చిత్రమిది. ఈ మూవీలో ప్రభాస్ హస్త సాముద్రికంలో లెజండ్ గా పేరొందిన విక్రమ్ ఆదిత్య పాత్రను పోషిస్తుంటే.. ఆయనకు జోడీగా ప్రేరణ పాత్రలో పూజా హెగ్డే కనిపించబోతోంది.