గత ఎన్నికల్లో వైసీపీ అద్భుతమైన విజయం సాధించిన..ఇంకా కొన్ని నియోజకవర్గాల్లో ఇంతవరకు వైసీపీ జెండా ఎగరలేదు. అయితే అధికారంలోకి వచ్చాక ఆ నియోజకవర్గాల్లో పట్టు సాధించడమే లక్ష్యంగా వైసీపీ ముందుకెళుతుంది. ఈ క్రమంలోనే టిడిపి కంచుకోటలుగా ఉన్న స్థానాలపై ఫోకస్ పెట్టి బలం పెంచుకుంటూ వస్తున్నారు. స్థానిక ఎన్నికల్లో సత్తా చాటారు.
ఇదే క్రమంలో అసెంబ్లీ ఎన్నికల్లో కూడా సత్తా చాటాలని వైసీపీ ప్రయత్నాలు చేస్తుంది. వచ్చే ఎన్నికల్లో కొన్ని టిడిపి కంచుకోటలని వైసీపీ కూల్చే అవకాశాలు ఉన్నాయి. అలాంటి సీట్లలో మండపేట కూడా ఒకటి అని చెప్పవచ్చు. ఇది పక్కా టిడిపి కంచుకోట. గత మూడు ఎన్నికల్లో టిడిపి నుంచి వేగుళ్ళ జోగేశ్వరరావు విజయం సాధించారు. 2009, 2014, 2019 ఎన్నికల్లో వరుసగా గెలిచారు. ఈయనకు వైసీపీ చెక్ పెట్టలేని పరిస్తితి. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పిల్లి సుభాష్ చంద్రబోస్ పోటీ చేసి ఓడిపోయారు.
అయితే తర్వాత టిడిపి నుంచి వైసీపీలోకి వచ్చిన తోట త్రిమూర్తులుని మండపేట ఇంచార్జ్ గా నియమించారు. ఈయన గత ఎన్నికల్లో టిడిపి నుంచి రామచంద్రాపురం బరిలో ఓడిపోయారు. ఈ సారి ఎన్నికల్లో వైసీపీ నుంచి మండపేటలో పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. తోట ఇంచార్జ్ గా వచ్చాక మండపేటలో వైసీపీ బలం పెరిగింది. పంచాయితీ, పరిషత్, మండపేట మున్సిపాలిటీని వన్ సైడ్గా గెలుచుకున్నారు.ఇక మండపేట అసెంబ్లీ గెలవడమే తరువాయి.
ఇటీవల సర్వేల్లో మండపేటలో వైసీపీకి ఆధిక్యం ఉందని తేలింది. దీంతో తోట పోటీ చేస్తే గెలుపు సులువే అని తెలుస్తోంది. కాకపోతే చిన్న ట్విస్ట్ ఉంది. అది ఏంటంటే ఇక్కడ జనసేనకు కాస్త బలం ఉంది. టిడిపి-జనసేన కలిస్తే వైసీపీకి ఇబ్బంది. కానీ తోట కాపు వర్గం నేత కాబట్టి. కాపు వర్గం ఓట్లు వైసీపీకే పడే ఛాన్స్ ఉంది. టిడిపికి జనసేన ఓట్లు బదిలీ అవ్వడం డౌటే. కాబట్టి టిడిపి కోట అయిన మండపేటలో ఈ సారి వైసీపీ గెలిచే ఛాన్స్ ఉంది.