వైసీపీ రెబల్ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి..టీడీపీలో చేరడం ఖాయమైంది. తాజాగా ఆమె శ్రీకాకుళం జిల్లాలో పర్యటనలో ఉన్న చంద్రబాబుని కలిశారు. మొన్న ఆ మధ్య వైసీపీ శ్రేణులు తనపై మాటల దాడి చేయడం, తన పార్టీ ఆఫీసులపై దాడి చేసినప్పుడు చంద్రబాబు, లోకేష్ తనకు మద్ధతుగా నిలించారని అందుకే కృతజ్ఞత తెలుపుకోవడానికి బాబుని కలిశానని శ్రీదేవి చెప్పుకొచ్చారు.
ఏ పార్టీలో చేరాలనే అంశంపై ఆలోచించుకున్నానని, ఏపీలో టిడిపి హవా ఉందని, టిడిపితోనే న్యాయం జరుగుతుందని, అందుకే యువగళం పాదయాత్ర తన నియోజకవర్గంలో ప్రవేశించే సమయానికి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని శ్రీదేవి చెప్పుకొచ్చారు. అంటే దాదాపు ఆమె టిడిపిలో చేరడం ఫిక్స్ అయిపోయింది. ఇక ఆమెకు టిడిపిలో సీటు విషయంలో గ్యారెంటీ లేదని తెలుస్తోంది. వాస్తవానికి వైసీపీలో కూడా ఆమెకు సీటు దక్కదనే ప్రచారం వచ్చింది. స్వతహాగా డాక్టర్ అయిన శ్రీదేవి..2019 ఎన్నికల్లో జగన్ వేవ్ లో వైసీపీ నుంచి తాడికొండ బరిలో గెలిచారు.
అమరావతి ఉద్యమం తీవ్రంగా జరిగిన ఆమె ఏ మాత్రం స్పందించలేదు. ఇక జగన్కు పలుమార్లు భజన చేస్తూ ఆమె హైలైట్ అయ్యారు. ఎప్పుడు నియోజకవర్గంలో పెద్దగా పనిచేసినట్లు కనిపించలేదు. ఓ వైపు అమరావతి, మరోవైపు ప్రజా వ్యతిరేకత పెరగడంతో శ్రీదేవికి వైసీపీలో సీటు లేదని తేలింది. ఇదే క్రమంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆమె టిడిపికి మద్ధతు తెలిపారు. దీంతో వైసీపీ ఆమెపై వేటు వేసింది.
ఈ క్రమంలో కొన్ని రోజుల పాటు ఆమె అడ్రెస్ లేరు. హైదరాబాద్ లోనే ఉండిపోయారు. ఇప్పుడు బాబుని వచ్చి కలిశారు. ఇక టిడిపిలో చేరడమే నెక్స్ట్. ఇప్పటికే వైసీపీ నుంచి బయటకొచ్చిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామ్ నారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి టిడిపిలోకి వచ్చారు. ఇప్పుడు శ్రీదేవి వంతు వచ్చింది. అయితే టిడిపిలోకి వచ్చిన ఆమెకు తాడికొండ సీటు దక్కే ఛాన్స్ లేదు. మరి టిడిపి అధికారంలోకి వస్తే వేరే ఏదైనా పదవి ఇస్తారేమో చూడాలి.