వచ్చే ఎన్నికల్లో టిడిపి-జనసేన కలిసి పోటీ చేయడం అనేది దాదాపు ఖాయమైంది. అధికారికంగా పొత్తుపై ప్రకటన రావాల్సి ఉంది. ఇక ఈ లోపు అంతర్గతంగా సీట్లపై చర్చ నడుస్తుంది. టిడిపి..జనసేనకు ఏ ఏ సీట్లు వదులుతుందనేది పెద్ద చర్చగా మారింది. కొన్ని సీట్ల విషయంలో జనసేన గట్టిగానే పట్టు పడుతుంది. అలాగే టిడిపి సైతం ఆ సీట్లని వదులుకోవడానికి రెడీగా లేదు.
కానీ సీట్లపై చర్చలు పూర్తిగా చంద్రబాబు, పవన్ చూసుకుంటారు. ఇంకా వారు డిసైడ్ చేసిందే ఫైనల్. అయితే విజయవాడలోని సీట్ల విషయంలో పెద్ద చర్చ నడుస్తోంది. విజయవాడ నగరంలో జనసేనకు కాస్త బలం ఉంది. మూడు సీట్లలో పట్టు ఉంది. అయితే సోలోగా గెలిచే బలం లేదు..కానీ మూడు నియోజకవర్గాల్లో గెలుపోటములని ప్రభావితం చేయగలదు. విజయవాడ ఈస్ట్, సెంట్రల్, వెస్ట్ సీట్లలో జనసేనకు ఎవరేజ్ గా 25 వేల ఓట్లు ఉంటాయి.
గత ఎన్నికల్లో తూర్పు టిడిపి గెలిస్తే..సెంట్రల్, వెస్ట్ టిడిపి స్వల్ప మెజారిటీలతో ఓడిపోయింది. వైసీపీ ఆ రెండు సీట్లు గెలుచుకుంది. వైసీపీ గెలవడానికి కారణం జనసేన ఓట్లు చీల్చడమే. అయితే ఇప్పుడు రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తే మూడు సీట్లలో వైసీపీ గెలుపు ఇబ్బంది అవుతుంది. ఇక పొత్తులో ఈస్ట్, సెంట్రల్ సీట్లు టిడిపికి దక్కడం ఖాయం. అటు వెస్ట్ సీటు జనసేనకు దక్కుతుందని తెలుస్తోంది.
ఎలాగో అక్కడ టిడిపి సీటు కోసం చాలామంది నేతలు ఆధిపత్య పోరుకు దిగుతున్నారు. అందుకే ఈ గోల లేకుండా ఆ సీటుని జనసేనకు కేటాయిస్తున్నట్లు తెలిసింది. ఒకవేళ బిజేపి కూడా పొత్తులో కలిస్తే అప్పుడు సీట్లు పంపకాలు ఎలా చేస్తారనేది చూడాలి.