మలయాళ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా ఎదుగుతున్న పృథ్వీరాజ్ సుకుమారన్ భారీ ప్రమాదం బారిన పడ్డారు. బస్సులో నుంచి జారిపడటంతో.. ఆయనకు తీవ్ర గాయాలు అయ్యాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ప్రస్తుతం పృథ్వీరాజ్ `విలాయత్ బుద్ధ` అనే సినిమా చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ దశలో ఉన్నాయి. అయితే తాజాగా కేరళలోని మరయూర్ బస్ స్టాండ్ లో ఓ ఆర్టీసీ బస్సులో భారీ యాక్షన్ సీక్వెన్స్ ను షూట్ చేశారు.
అయితే ఈ యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరిస్తుండగా.. బస్సులో నుంచి పృథ్వీరాజ్ సుకుమారన్ పొరపాటున జారిపడ్డారు. ఈ క్రమంలో ఆయన కాలికి తీవ్ర గాయమైంది. దాంతో ఆయన్ను వెంటనే కొచ్చిలోని ప్రైవేట్ హాస్పటల్ కి పృథ్విరాజ్ ని తరలించారు. పరీక్షల అనంతరం పృథ్విరాజ్ కాలికి సర్జరీ చేయాలని వైద్యులు సూచించారు.
ఈరోజు లేదా రేపు ఆయనకు సర్జరీ జరగబోతోంది. ఇందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఈ సర్జరీ అయిన అనంతరం దాదాపు మూడు నెలల పాటు బెడ్ రెస్ట్ ఉండాలని చెప్పారట. ఇదే ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ ను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. పృథ్విరాజ్ సుకుమారన్ ప్రస్తుతం తెలుగులో ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న `సలార్` మూవీలో విలన్ గా చేస్తున్నాడు. షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం సెప్టెంబర్ లో విడుదల కానుంది. అయితే ఇప్పుడు పృథ్విరాజ్ సుకుమారన్ కు యాక్సిడెంట్ అవ్వడంతో.. సలార్ విడుదల వాయిదా పడటం ఖాయమని ప్రభాస్ ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. ఇక ఇదే క్రమంలోనే పృథ్విరాజ్ త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ ఆకాక్షిస్తున్నారు.