దగ్గుబాటి రామానాయుడు తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన వెంకటేష్.. భారీ సినీ బ్యాక్గ్రౌండ్ ఉన్నాసరే తన టాలెంట్ నే నమ్ముకున్నాడు. సెలక్టివ్ గా కథలను ఎంపిక చేసుకుంటూ వరుస విజయాలను ఖాతాలో వేసుకుని విక్టరీ వెంకటేష్ గా స్టార్ హోదాను అందుకున్నాడు. ఆరు పదుల వయసులోనూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నాడు.
ప్రస్తుతం `హిట్` సినిమా ఫేమ్ శైలేష్ కొలను దర్శకత్వంలో `సైంథవ్` అనే భారీ యాక్షన్ మూవీ చేస్తున్నాడు. జెర్సీ ఫేం శ్రద్ధ శ్రీనాథ్ ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సంగతి పక్కన పెడితే.. వెంకటేష్, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో ఓ సినిమా రావాల్సి ఉంది. కానీ, ఈ విషయం చాలా మందికి తెలియదు.
నిజానికి వెంకటేష్ `స్వామి వివేకానంద` బయోపిక్ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాడట. ఆది ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ అట. అయితే `మగధీర` విడుదల సమయంలో `స్వామి వివేకానంద` బయోపిక్ ను డైరెక్ట్ చేయాల్సిందిగా వెంకీ రాజమౌళిని అడిగారట. అందుకు రాజమౌళి కూడా వెంటనే ఓకే చెప్పారట. కానీ, అప్పటికే రాజమౌళి కొన్ని ప్రాజెక్ట్ కు కమిట్ అవ్వడం.. వెంటనే బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి భారీ ప్రాజెక్ట్స్ లో భాగం అవ్వడం జరిగిపోయాయి. ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబుతో తన తదుపరి చిత్రాన్ని చేసేందుకు సిద్ధం అవుతున్నారు. మొత్తానికి రాజమౌళి ఇతర ప్రాజెక్ట్ ల కారణంగా.. వెంకీతో సినిమానే అలానే ఆగిపోయింది. ఇప్పట్లో వీరి కాంబో ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశాలు కూడా కనిపించడం లేదు.