నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ప్రేమలో ఉన్నారంటూ గత కొన్నాళ్ల నుంచి ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. గీత గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాల్లో వీరిద్దరూ జంటగా నటించారు. ఆన్ స్క్రీన్పై వీరిద్దరి కెమిస్ట్రీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇదే సమయంలో విజయ్, రష్మికల సన్నిహిత్యం చూసి.. వీరిద్దరూ నిజంగా ప్రేమలో ఉన్నారంటూ ప్రచారం ఊపందుకుంది.
పలు మార్లు విజయ్, రష్మిక జంటగా మీడియాకు చిక్కడం, కలిసి వెకేషన్స్ వెళ్లడం వంటి అంశాలు నెట్టింట జరుగుతున్న ప్రచారానికి మరింత బలాన్ని చేకూర్చాయి. ఈ సంగతి పక్కన పెడితే.. తాజాగా రష్మికకు పబ్లిక్ లోనే రౌడీ ఫ్యాన్స్ దిమ్మతిరిగే షాకిచ్చారు. అసలేం జరిగిందంటే.. విజయ్ తమ్ముడు అనంద్ దేవరకొండ `బేబీ` సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సాయిరాజేష్ నీలం దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించింది.
తాజాగా ఈ సినిమాలోని `ప్రేమిస్తున్న` అనే టైటిల్ తో మూడో పాటను రష్మిక చేత విడుదల చేయించారు. హైదరాబాద్ లోని పీవీఆర్ ఆర్కే సినీ ప్లెక్స్ స్క్రీన్ 1లో సాంగ్ లాంచ్ ఈవెంట్ జరిగింది. అయితే ఈ ఈవెంట్ లో రష్మిక మాట్లాడేందుకు మైక్ తీసుకోగానే.. విజయ్ ఫ్యాన్స్ ఒక్కసారిగా `వదిన.. వదిన` అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దాంతో పాపం పాపకు ఒక్క క్షణం నోట మాట రాలేదు. ఆపై షాక్ నుంచి తేరుకుని బేబీ సినిమా, ఆ చిత్ర లిరికల్ సాంగ్ గురించి మాట్లాడి ఆమె అక్కడ నుండి వెళ్లిపోయారు. దీంతో మరిది ఆనంద్ దేవరకొండ సినిమాకు తన వంతు సపోర్ట్ చేయడానికి వదినగా రష్మిక వచ్చిందంటూ చాలా మంది కామెంట్లు చేస్తున్నారు.