ఏపీలో బీజేపీ పరిస్తితి చాలా వింతగానే ఉందని చెప్పాలి. ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉన్నారని, ఏపీలో బిజేపి నేతలు హడావిడి చేస్తున్నారు గాని..రాష్ట్రానికి న్యాయం చేయని బిజేపిని ఏపీ ప్రజలు ఆదరించే పరిస్తితి కనిపించడం లేదు. అదే సమయంలో బిజేపిలో రకరకాల నేతలు ఉన్నారు. కొందరేమో వైసీపీకి మద్ధతుగా రాజకీయం చేస్తుంటే..మరికొందరు టిడిపికి అనుకూలంగా ఉన్నారు.
వైసీపీకి మద్ధతుగా ఉన్నవారు టిడిపితో పొత్తు లేకుండా చూసుకునే పనిలో ఉన్నారు. టిడిపికి మద్ధతు గా ఉన్నవారు..టిడిపితో పొత్తుకు రెడీ అవుతున్నారు. కానీ ఏదైనా బిజేపి అధిష్టానం నిర్ణయం తీసుకోవాల్సిందే. ఎలాగో బిజేపి సింగిల్ గా పోటీ చేస్తే ఒక్క చోట కూడా డిపాజిట్ రాదు. అదే టిడిపి-జనసేనలతో కలిస్తే నాలుగు సీట్లు అయిన గెలుచుకోవచ్చు. ఆ ఆశలతోనే బిజేపిలో ఉన్న టిడిపి మద్ధతుదారులు ఉన్నారు. ఎలాగైనా టిడిపి-జనసేనతో బిజేపితో కలిసేలా ప్లాన్ చేస్తున్నారు. కానీ బిజేపి అధిష్టానం నుంచి ఇంకా పొత్తు పై సిగ్నల్ రాలేదు.
ఎప్పుడు సిగ్నల్ వస్తుందేమో అని చూస్తున్నారు. ఒకవేళ పొత్తు లేకపోతే..టిడిపి లేదా జనసేనలోకి జంప్ అవ్వాలని చూస్తున్నారు. మెజారిటీ నేతలు టిడిపిలోకి జంప్ చేయాలని చూస్తున్నారు. ముఖ్యంగా గత ఎన్నికల్లో టిడిపి లో పోటీ చేసి ఓడిపోయి, ఆ తర్వాత బిజేపిలోకి వచ్చిన నేతలు..మళ్ళీ ఇప్పుడు టిడిపిలోకి వెళ్ళి పోటీ చేయాలని చూస్తున్నారు. కానీ టిడిపిలోకి వస్తే సీట్లు ఉంటాయో లేదో తెలియకుండా ఉంది.
కొందరికైతే సీట్లు దక్కే ఛాన్స్ ఉందనే చెప్పవచ్చు..మరికొందరికి డౌటే. కానీ ఎంతమంది బిజేపి నేతలు టిడిపిలోకి వెళ్తారో చూడాలి. అసలు టిడిపి-జనసేనతో బిజేపి కలుస్తుందో లేదో చూడాలి.