పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన `ఛత్రపతి` ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఎప్పుడో 18 సంవత్సరాల క్రితం విడుదల అయిన ఈ చిత్రాన్ని బెల్లంకొండ సాయి శ్రీనివాస తాజాగా బాలీవుడ్ లో రీమేక్ చేశాడు. వి.వి.వినాయక్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నుష్రత్ బరుచ, శరద్ ఖేల్కర్, భాగ్యశ్రీ తదితరులు కీలక పాత్రలను పోషించారు.
మే 12న ఈ చిత్రం బాలీవుడ్ లో విడుదలైంది. కానీ, నార్త్ ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. బాలీవుడ్ ఆడియన్స్ నుంచి బెల్లకొండ యాక్టింగ్ కి మంచి మార్కులే పడ్డాయి. అయితే కథ అవుట్ డేటెడ్ అయ్యిపోయిందని చాలా మంది పెదవి విరిచారు. టాక్ అనుకూలంగా లేకపోవడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ మాత్రం ప్రభావం చూపలేకపోతోంది.
మొదటి రోజు రూ. 65 లక్షలు రాబట్టిన ఈ చిత్రం.. రెండో రోజు రూ. 45 లక్షల షేర్ తో సరిపెట్టుకుంది. ఇక మూడో రోజు సండే అయినప్పటికీ వసూళ్లు అంతంత మాత్రగానే వచ్చాయని అంటున్నారు. ఇలాంటి తరుణంలో ఈ మూవీకి సంబంధించి ఓ షాకింగ్ న్యూస్ తెరపైకి వచ్చింది. అదేంటంటే.. బాలీవుడ్ లో ఛత్రపతిని ప్రమోట్ చేయడానికి నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ గట్టిగానే ఖర్చు పెట్టిందట. కేవలం పబ్లిసిటీకే ఏకంగా రూ. 20 కోట్లు వెచ్చించారట. అందులో దాదాపు రూ. 5 కోట్లు ప్రయాణ ఖర్చులు, హోటల్ చార్జ్లకే వాడారని అంటున్నారు. ఈ విషయం తెలిసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.