హాట్ టాపిక్ గా సంక్రాంతి సినిమాల బ‌డ్జెట్.. టాప్‌లో ఉన్న‌ది ఆ మూవీనే!

సంక్రాంతి పండుగ వస్తోందంటే తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు కళకళలాడిపోతుంటాయి. వచ్చే ఏడాది సంక్రాంతి బ‌రిలోనూ చాలా సినిమాలు పోటీ పడిపోతున్నాయి. అయితే వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి, వారసుడు, తునివు సినిమాల మధ్యే అస‌లు పోటి నడవబోతోంది. అయితే ఇప్పుడు ఈ సినిమాల బడ్జెట్ హాట్ టాపిక్ గా మారింది.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమే `వాల్తేరు వీరయ్య`. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ చిత్రం జనవరి 13న విడుదల కాబోతోంది. అయితే ఈ సినిమా బ‌డ్జెట్‌ రెమ్యునరేషన్లతో కలిపి రూ. 140 కోట్లకు చేరుకుందని అంటున్నారు. అలాగే బాలకృష్ణ గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం `వీర‌ సింహారెడ్డి`. మైత్రీ వారే ఈ మూవీని నిర్మించ‌గా.. జ‌న‌వ‌రి 12న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. అయితే ఈ మూవీకి రూ.110 కోట్లు బడ్జెట్ అయినట్టు తెలుస్తోంది.

 

`వార‌సుడు` ఓ తమిళ చిత్రం. తెలుగులో డబ్ చేసి విడుదల చేయబోతున్నారు. ఇందులో విజయ్ దళపతి హీరోగా నటిస్తుంటే.. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. జ‌న‌వ‌రి 12న ఈ సినిమా రిలీజ్ కానుంది. అయితే దిల్ రాజు ఈ సినిమా కోసం ఏకంగా రూ. 250 కోట్లు బడ్జెట్ కేటాయించార‌ట‌. సంక్రాంతి బ‌రిలో ఇదే హైయెస్ట్ బడ్జెట్ మూవీ అని టాక్ నడుస్తోంది. ఇక తునివు కూడా తమిళ సినిమానే కాగా తెలుగులో డబ్ చేసి విడుదల చేస్తున్నారు. అజిత్ ఇందులో హీరోగా న‌టించారు. అయితే రూ. 100 కోట్లకు పైగా ఈ మూవీ బడ్జెట్ అయిందని టాక్.