నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపుదిద్దుకున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ `వీర సింహారెడ్డి`. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ చిత్రంలో శ్రుతిహాసన్, హనీ రోజ్ హీరోయిన్లుగా నటించారు. వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ కానుక జనవరి 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ సినిమాలో ఒక కీలక పాత్రను పోషించిన ప్రముఖ నటుడు రోహిత్ పాఠక్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు.
ఈ సందర్భంగా వీర సింహారెడ్డి సినిమా విశేషాలతో పాటు బాలయ్యపై సైతం ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఈ సినిమాలో తాను నార్త్ కు చెందిన కాంట్రాక్ట్ కిల్లర్గా కనిపిస్తానని, తన పాత్ర సినిమాకి కీలకంగా ఉంటుందని రోహిత్ తెలిపాడు. సినిమాలోని కథ మొత్తం మలుపు తిప్పే విధంగా తన పాత్రను డిజైన్ చేశారని.. బాలకృష్ణకు తనకు మధ్య జరిగే సన్నివేశాలు బాగా ఆకట్టుకుంటాయని రోహిత్ చెప్పుకొచ్చాడు.
ఇక బాలయ్య గురించి మాట్లాడుతూ `రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జరుగుతున్నప్పుడు టైమ్ లో నేను వెళ్ళాను. బాలకృష్ణ దగ్గరకు వెళ్ళి నన్ను పరిచయం చేసుకున్నాను. వెంటనే ఆయన `మీ గురించి నాకు తెలుసు` అని నవ్వారు. ఆయన అలా అనడం నేను అస్సలు ఊహించలేదు. ఆయనతో పని చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. బాలయ్య ఎంతో వినయంగా ఉంటారు. ఆయన ఇతరుల పట్ల చూపించే గౌరవం ఎంతగానో నన్ను ఆకట్టుకుంది. బాలయ్య ప్రవర్తనకు షాక్ అయ్యాను` అంటూ రోహిత్ చెప్పుకొచ్చాడు. దీంతో ఈయన కామెంట్స్ కాస్త వైరల్ గా మారాయి.