నేషనల్ క్రష్ రష్మిక మందన్నా వచ్చే ఏడాది సంక్రాంతికి `వారసుడు` సినిమాతో సందడి చేయబోతున్న సంగతి తెలిసిందే. దళపతి విజయ్ హీరోగా టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి తెరకెక్కించిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు పాన్ ఇండియా స్థాయిలో నిర్మించారు. శరత్ కుమార్, ప్రకాశ్ రాజ్, ఖుష్బూ తదితరులు ఇందులో కీలక పాత్రలను పోషించగా.. తమన్ స్వరాలు అందించాడు.
సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలోనే చెన్నైలో నెహ్రూ ఇండోర్ స్టూడియోలో ఈ మూవీ ఆడియో ఫంక్షన్ ను నిర్వహించారు. ఈ ఫంక్షన్ ఎంతో సందడిగా సాగింది. అయితే ఈ కార్యక్రమంలో రష్మిక మాట్లాడుతూ.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. విజయ్ అంటే తనకు ఎంతో అభిమానం అని, ఆయన నటించిన గిల్లి చిత్రాన్ని తన తండ్రితో కలిసి చూశానని.. అప్పటినుంచి ఆయన నటనను, డైలాగ్ డెలివరీని ఇమిటేషన్ చేయడం ప్రారంభించానని రష్మిక చెప్పుకొచ్చింది.
అంతేకాదు మీకు నచ్చిన నటుడు.. మీ క్రష్ ఎవరిని అడిగితే..? విజయ్ అని చెబుతానని రష్మిక పేర్కొంది. అయితే రష్మిక మాటలు టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ను బాగా హర్ట్ చేశాయి. అందుకు కారణం లేకపోలేదు..విజయ్ దేవరకొండ రష్మిక ప్రేమలో ఉన్నారంటూ ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. వీరిద్దరూ కలిసి వెకేషన్ కు వెళ్లడం, డిన్నర్ డేట్లు చేయడం ఈ వార్తలకు మరింత బలం చేకూర్చాయి. కానీ తాజాగా రష్మిక విజయ్ తన క్రష్ అని చెప్పడం విజయ్ దేవరకొండ అభిమానులకు ఏమాత్రం నచ్చలేదు. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియా వేదికగా రష్మిక కామెంట్స్ పై రౌడీ ఫ్యాన్స్ కోపం వ్యక్తం చేస్తున్నారు.