సర్వే స్టోరీ: 60 మందిపై వేటు?

అధికార వైసీపీకి ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా పనిచేస్తున్న విషయం తెలిసిందే. గతంలో వ్యూహకర్తగా పనిచేసి ఆ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. ఇప్పుడు కూడా అదే దిశగా పనిచేస్తున్నారు. ఇప్పటికే పీకే టీం నియోజకవర్గాల్లో పర్యటిస్తూ…ఎమ్మెల్యేల పనితీరుని, సంక్షేమ పథకాల అమలు, ప్రత్యర్ధి పార్టీల బలాలపై సర్వేలు చేస్తూ…ఎప్పటికప్పుడు జగన్‌కు నివేదికలు ఇస్తున్నారు. అయితే ఈ నివేదికలు అధికారికంగా ఎప్పుడు బయటకు రాలేదు. ఎప్పుడో ఏదొక రూపంలో మీడియాలో లీకులు వస్తూనే ఉన్నాయి.

ఇప్పటికే కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందని, వారికి జగన్ నెక్స్ట్ సీటు ఇవ్వరని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఆ మధ్య జరిగిన వైసీపీ వర్క్ షాప్‌లో ఎమ్మెల్యేలకు జగన్ పరోక్షంగా వార్నింగ్ కూడా ఇచ్చారు. పనితీరు బాగోని ఎమ్మెల్యేలకు సీటు ఇవ్వనని చెప్పేశారు. కాబట్టి ఎమ్మెల్యేలు ఇక నుంచి పనితీరు మెరుగుపర్చుకోవాలని సూచించారు. అయితే ఇప్పుడున్న పరిస్తితుల్లో ఇంకా చాలామంది ఎమ్మెల్యేల పనితీరు అంతంత మాత్రమే ఉందని తెలుస్తోంది.

ఈ క్రమంలోనే తాజాగా టీడీపీ అనుకూల మీడియా సంస్థలో పీకే టీం సర్వే అంటూ ఓ కథనం వచ్చింది. వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేలు ఉండగా…అందులో సగం మందిపై వ్యతిరేకత ఉందని, నెక్స్ట్ వారికి సీట్లు ఇస్తే గెలవడం కష్టమని పీకే టీం సర్వేలో తేలిందని చెప్పింది. అయితే సగం అంటే 75 మంది ఎమ్మెల్యేలకు కాకపోయినా 60 మందికి సీట్లు ఇవ్వకూడదని జగన్ భావిస్తున్నారట. అలాగే వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలు ఉన్న స్థానాల్లో అదనపు సమన్వయకర్తలని పెట్టాలని జగన్ చూస్తున్నారట.

ఇప్పటికే తాడికొండలో ఎమ్మెల్యే శ్రీదేవి ఉండగా, అక్కడ అదనపు సమన్వయకర్తగా డొక్కా మాణిక్యవరప్రసాద్‌ని పెట్టారు. అలా పలు స్థానాల్లో సిట్టింగులని సైడ్ చేయాలని జగన్ చూస్తున్నారట. ఏ ఏ స్థానాల్లో సిట్టింగులని పక్కన పెట్టాలో ఆ స్థానాలని కూడా టీడీపీ అనుకూల మీడియా చెప్పుకొచ్చింది. ఉదాహరణకు ఉమ్మడి గుంటూరు జిల్లాలో తాడికొండ, వేమూరు, సత్తెనపల్లి, బాపట్ల, మంగళగిరి, పొన్నూరు, తెనాలి, చిలకలూరిపేట నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలపై ప్రతికూల నివేదిక వచ్చినట్లు చెప్పింది. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు…ఇక జగన్ ఎంతమంది సిట్టింగులపై వేటు వేస్తారో చూడాలి.