ఆ విష‌యంలో తేలిపోయిన `పుష్ప‌`.. పెద‌వి విరుస్తున్న ఫ్యాన్స్!?

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తొలి పాన్ ఇండియా చిత్రం `పుష్ప‌`. క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ తెర‌కెక్కించిన ఈ చిత్రంలో రష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టించింది. అలాగే మ‌ల‌యాళ స్టార్ హీరో ఫహాద్‌ ఫాజిల్, ప్ర‌ముఖ టాలీవుడ్ న‌టుడు సునీల్ విల‌న్లుగా న‌టించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ వారు నిర్మించారు.

భారీ అంచ‌నాలు ఉన్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతుండ‌గా.. ఫ‌స్ట్ పార్ట్ `పుష్ప ది రైజ్‌` నేడు ప్ర‌పంచ‌దేశాల్లోనూ ఐదు భాష‌ల్లో అట్ట‌హాసంగా విడుద‌లైంది. రాయలసీమలోని శేషాచలం అడవుల్లో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేప‌థ్యంలో సాగే ఈ చిత్రం మాస్ ప్రేక్ష‌కుల‌కు విప‌రీతంగా ఆక‌ట్టుకుంటోంది.

పుష్ప రాజ్‌గా అల్లు అర్జున్ నటన అద్భుతంగా ఉంది. స్క్రీన్‌పై ఆయన యాటిట్యూడ్ మ్యానరిజం పీక్స్‌లో ఉండ‌గా.. సుకుమార్ టేకింగ్‌, సందర్భానుసారంగా వచ్చే పోరాట సన్నివేశాలు, ఎలివేషన్స్ అదిరిపోయాయి. అలాగే సాంగ్స్‌కి దేవిశ్రీ ప్ర‌సాద్ అందించిన ట్యూన్స్ కూడా ఆక‌ట్టుకున్నాయి. కానీ, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ విష‌యంలో మాత్రం పుష్ప తేలిపోయింద‌ని అంటున్నారు.

ఈ విష‌యంలో బ‌న్నీ ఫ్యాన్స్ సైతం పెద‌వి విరుస్తున్నారు. బీజీఎం బాగుంటే సినిమాలు ఏ లెవెల్ లో హిట్ అవుతాయి అనడానికి కేజీఎఫ్‌, బాహుబలి తో పాటు రీసెంట్ గా విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచిన‌ అఖండ సినిమాలే బెస్ట్ ఉదాహరణగా చెప్పుకోవ‌చ్చు. కానీ, బీజీఎం విష‌యంలో పుష్ప పెద్ద‌గా ఇంపాక్ట్ చూప‌లేద‌ని.. అదే సినిమాకు పెద్ద మైన‌స్ అని టాక్ న‌డుస్తోంది.