పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తాజా చిత్రం `రాధేశ్యామ్`. కె.రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటించగా.. రెబల్ స్టార్ కృష్ణంరాజు, భాగ్యశ్రీ, మురళి శర్మ తదితరులు కీలక పాత్రలను పోషించారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్పై కృష్ణంరాజు సమర్పణలో వంశీ, ప్రమోద్, ప్రసీదాలు నిర్మించిన ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కానుంది.
రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్న చిత్ర యూనిట్.. గురువారం సాయంత్రం హైదరాబాద్లోని రామోజీ ఫిలిం సిటీలో అంగరంగవైభవంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ ఈవెంట్కు వివిధ రాష్ట్రాల నుంచి దాదాపు నలబై వేల మంది అభిమానులు విచ్చేయగా.. వెయ్యి మంది పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
అయితే ఈ ఈవెంట్ మధ్యలో ఘోర విషాదం నెలకొంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ నేపథ్యంలో భారీ ఎత్తున కటౌట్ ను ఏర్పాటు చేయగా.. అభిమానులు వాటి మీదికి ఎక్కారు. దాదాపు 40 మంది అభిమానులు ప్రభాస్ కటౌట్ మీదికి ఎక్కేశారు.
ఈవెంట్ నిర్వాహకులు కిందకు దిగమని ఎంత విజ్ఞప్తి చేసిన పట్టించుకోలేదు. దీంతో అభిమానుల బరువుకు ప్రభాస్ కటౌట్ కూలి పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యని తెలుస్తుండగా.. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా సమాచారం. ఇక మరిన్ని వివరాలో త్వరలోనే బయటకు రానున్నాయి.