యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన తాజా చిత్రం `ఆర్ఆర్ఆర్(రౌద్రం.. రణం.. రుధిరం)`. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై డివివి దానయ్య నిర్మించిన ఈ చిత్రంలో అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటించగా.. అజయ్ దేవ్గన్, శ్రీయలు కీలక పాత్రలను పోషించారు. ఎం. ఎం. కీరవాణి సంగీతం అందించారు.
ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 7న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ వేగవంతం చేసిన మేకర్స్.. ఎన్టీఆర్ పాత్రకి సంబంధించి డిజైన్ చేసిన సాంగ్ ప్రోమోను విడుదల చేశారు. `కొమురం భీముడో..` అంటూ సాగే ఈ పాట ఆద్యంతం ఆకట్టుకుంది.
గోండు బెబ్బులి కొమురం భీమ్ ధైర్యసాహసాలను చాటిచెప్తూ అద్భుతమైన లిరిక్స్ అందించాడు సుద్దాల అశోక్ తేజ. కీరవాణి సంగీతం అందించిన ఈ పాటను తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఆయన తనయుడు కాలభైరవ ఆలపించారు. మొత్తానికి అదిరిపోయిన ఆ సాంగ్ యూట్యూబ్లో రికార్డు వ్యూస్తో దూసుకుపోతోంది.
అయితే ఇలాంటి తరుణంలో `కొమురం భీముడో` సాంగ్పై కాపీ మరకలు పడ్డాయి. ప్రముఖ ప్రజా గాయకుడు గద్దర్ రచించి పాడిన `మదనా సుందరీ.. మదనా సుందరీ` అనే పాట మాదిరిగానే `కొమురం భీముడో` సాంగ్ ఉందని.. `మదనా సుందరీ` పాటనే కాఫీ చేశారని పలువురు నెట్టింట రచ్చ చేస్తున్నారు. మరి దీనిపై ఆర్ఆర్ఆర్ యూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి.