మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, నటసింహం నందమూరి బాలకృష్ణ కాంబోలో ముచ్చటగా మూడోసారి తెరకెక్కిన తాజా చిత్రం `అఖండ`. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో ప్రజ్ఞ జైస్వాల్ హీరోయిన్గా నటించగా.. జగపతిబాబు, పూర్ణ, శ్రీకాంత్ కీలక పాత్రలను పోషించారు.
ఎన్నో అంచనాల నడుమ డిసెంబర్ 2న విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ను సొంతం చేసుకుంది. అఘోరా పాత్రలో బాలయ్య నట విశ్వరూపం, బోయపాటి డైరెక్షన్, తమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అభిమానులకు పూనకాలు తెప్పించాయి. మరోవైపు కరోనా కారణంగా సినిమా థియేటర్ కి ప్రేక్షకులు రారు అనుకుంటున్న ఈ క్లిష్టపరిస్థితుల్లో అఖండ ఘన విజయం సాధించడం.. సినీ వర్గాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.
ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను రాబడుతోన్న అఖండ.. అతి త్వరలోనే ఓటీటీలో విడుదల కాబోతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఈ సినిమా హక్కులను భారీ ధరకు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే అగ్రిమెంట్ కుదుర్చుకున్నపుడే సినిమా విడుదలైన 30 రోజుల తర్వాత స్ట్రీమింగ్ చేయాలని నిర్ణయించుకున్నారట.
ఈ నేపథ్యంలోనే కొత్త సంవత్సరం కానుకగా జనవరి 1న `అఖండ`ను హాట్ స్టార్లో స్ట్రీమింగ్ చేయాలని మేకర్స్ తేదీని ఖరారు చేసినట్లు గుసగుగసలు వినిపిస్తున్నాయి. మరి ఇది ఎంత వరకు నిజమో తెలియాలంటే.. అధికారిక ప్రకటన రావాల్సిందే.