దేశంలో ఒక్కరోజే 2796 కరోనా మరణాలా… అసలు నిజం ఇదీ..

దేశవ్యాప్తంగా నమోదవుతున్న కరోనా కేసులు, మరణాల సంఖ్య గురించి కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు వివరాలను అందజేస్తోంది. ప్రతి ఇరవై నాలుగు గంటలకు ఒకసారి ఈ వివరాలను తెలుపుతోంది. అయితే గడచిన 24 గంటల్లో దేశంలో 2796 మంది కరోనాతో చనిపోయినట్లు వార్తలు వస్తుండడంతో కలకలం రేపుతోంది.

అయితే అది ప్రభుత్వం ప్రకటించిన గణాంకాల మేరకు నిజమే అయినప్పటికీ అవి 24 గంటల్లో చనిపోయినవారి సంఖ్య కాదు. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 370 మంది ఈ వైరస్ బారిన పడి చనిపోయారు. అయితే గతంలో బీహార్ రాష్ట్రంలో 2426 మంది వైరస్ బారిన పడి చనిపోయినప్పటికీ వారిని కరోనా మృతుల కింద లెక్క కట్టలేదు. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఈ మరణాలను కరోనా మరణాలుగా గుర్తించింది. గత 24 గంటల్లో నమోదైన పాజిటివ్ కేసుల వివరాలు, మరణాల సంఖ్యలో వీటిని కూడా కలిపి ప్రకటించడంతో ఒక్కరోజులో మొత్తం కరోనా మరణాల సంఖ్య 2796గా గణాంకాల్లో కనిపిస్తోంది.

కాగా దేశవ్యాప్తంగా ఇవాళ కరుణ కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. గత 24 గంటల్లో 8895 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే గడచిన 24 గంటల్లో ఆరువేల 6918 మంది వైరస్ బారి నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 99155 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడచిన 24 గంటల్లో కోటి మందికి పైగా వ్యాక్సిన్ వేశారు. కాగా దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్ నాలుగు కేసులు నమోదు కావడంతో.. కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేస్తోంది.