ఆ స్వతంత్రులకు సపోర్ట్ ఇస్తున్నదెవరో?

తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల వ్యవహారం రసవత్తరంగా సాగుతోంది. ఎమ్మెల్యే కోటాలో అధికార పార్టీకి ఏ ఇబ్బందీ లేకపోయినా స్థానిక సంస్థల ఎన్నికలు మాత్రం తలనొప్పిగా మారనున్నట్లు సమాచారం. రాష్ట్రంలో ఖాళీగా ఉన్నది 12 స్థానాలు. 12 సీట్లకు గాను 12 మంది అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. రెండు చోట్ల మాత్రం కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్లు బరిలోకి దిగారు. అసలు విషయమేమంటే.. 12 సీట్లకు గాను 102 మంది నామినేషన్లు ఫైల్ చేయడంతో అధికార పార్టీ అభ్యర్థులకు టెన్షన్ పట్టుకుంది. ఇంతమంది ఎన్నికల్లో పోటీచేయాలని అనుకుంటే.. ఇక మేమెలా గెలుస్తాం అని సన్నిహితులతో వాపోతున్నట్లు తెలిసింది. చాలా ప్రాంతాల్లో అధికార పార్టీ మద్దతు దారులే రెబల్స్ గా బరిలోకి దిగినట్లు సమాచారం. పార్టీకి, ప్రభుత్వానికి ఈ విధంగానైనా తమ వాయిస్ వినిపించాలని నాయకులు భావిస్తున్నట్లు సమాచారం.

ఇదిలా ఉండగా భారతీయ జనతా పార్టీ మాత్రం తాము ఈ ఎన్నికల్లో పోటీచేయడం లేదని బహిరంగంగా చెప్పేసింది. అయినా తెరవెనుక వ్యవహారాలు మాత్రం నడుపుతన్నట్లు సమాచారం. 12 సీట్లకు గాను ఇంతమంది 102 మంది నామినేషన్లు వేశారంటే.. దాని వెనుక కచ్చితంగా బీజేపీ ప్లాన్ ఉంటుందని కారు పార్టీ నాయకులు అనుమానిస్తున్నారు. నేరుగా బరిలోకి దిగకుండా తెరవెనుక రాజకీయాలు నడుపుతోందని విమర్శిస్తున్నారు. కారు పార్టీ పరువు తీయాలనేది వారి అంతిమ లక్ష్యంగా కనిపిస్తోందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. బీజేపీ ఎక్కడా కనీసం ఒక్కటంటే ఒక్క నామినేషన్ కూడా ఫైల్ చేయలేదు. అయినా సరే.. రాజకీయాలు కదా.. కారు పార్టీకి నిద్రలేకుండా చేయాలనేది వారి ప్లాన్. అసలే హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలిచి మంచి జోష్ మీదున్న టీ.బీజేపీ నాయకులకు ఆ పార్టీ హైకమాండ్ కూడా ఫుల్ సపోర్ట్ ఇస్తున్నట్లు తెలిసింది. దీంతో తెలంగాణలో జోరుగా ముందుకు పోతున్నారు కమలం నాయకులు. మరి వారి ప్లాన్ సక్సెస్ అవుతుందా, లేదా అనేది వేచి చూడాల్సిందే.