సీనియర్ నటులు రాజశేఖర్-జీవిత దంపతుల పెద్ద కూతురు శివాని రాజశేఖర్ తొలి చిత్రం ‘అద్భుతం’. తేజ సజ్జా హీరోగా మల్లిక్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ సంస్థ `డిస్నీ ప్లస్ హాట్స్టార్`లో నవంబర్ 19న విడుదల కానుంది.
ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శివాని.. ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంది. ఆమె మాట్లాడుతూ.. `స్టార్ కిడ్స్ స్ట్రగుల్స్ లేకుండా ఇండస్ట్రీలో సులభంగా రాణిస్తుంటారని అనుకుంటుంటారు. అందరికి ఏమో కానీ నా విషయంలో మాత్రం అలా జరగలేదు. ఏ సినిమా మొదలుపెట్టినా ఆగిపోవడంతో నాకు నేనే ఐరెన్లెగ్గా భావించుకున్నా. దాంతో డిప్రెషన్లోకి కూరుకుపోయా.
కానీ అమ్మానాన్నల ప్రోత్సాహం, ధైర్యం వల్లే కష్టాల్ని సవాల్గా స్వీకరించి ధైర్యంగా నిలబడ్డా` అని చెప్పుకొచ్చింది. కాగా, 2018లో శివాని తొలుత `టూస్టేట్స్` రీమేక్ అంగీకరించగా.. అది అనివార్య కారణాల వల్ల ఆగిపోయింది. ఆ తర్వాత ఆమెకు విష్ణువిశాల్తో ఓ తమిళ సినిమా చేసే అవకాశం రాగా.. ఆ సినిమా సైతం మధ్యలోనే నిలిచిపోయింది. ఇక ఎట్టకేలకు ఈ భామ అద్భుతం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతోంది.