ఈసారి ప్రచారం లేదు.. పర్యవేక్షణే..!

ఈనెల 30వ తేదీన జరిగే హుజూరాబాద్ ఉప ఎన్నికలకు ముఖ్యమంత్రి ప్రచాయం చేయకపోవచ్చు. ఆయన ప్రచారం చేయకపోయినా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తారు. ముఖ్యంగా కుమారుడు కేటీఆర్ ను రంగంలోకి దించే అవకాశముంది. దాదాపు ప్రతి ఎన్నికల్లోనూ ముఖ్యమంత్రి బహిరంగ సభల్లో పాల్గొని ప్రచారాన్ని పీక్ స్థాయికి తీసుకెళతారు. అయితే హుజూరాబాద్ లో మాత్రం అడుగుపెట్టకపోవచ్చని తెలుస్తోంది. కారణం ఎన్నికల కమిషన్.. కోవిడ్ కారణంగా వెయ్యి మందికి మించి ఎన్నికల బహిరంగ సభకు హాజరు కాకూడదని ఎన్నికల సంఘం హుకుం జారీచేసింది.

కేసీఆర్ సభకు హాజరు కావాలంటే వేలమంది, లక్షల మంది ఉంటారు. అంతమంది ఉంటేనే కేసీఆర్ ఉత్సాహంగా మాట్లాడతారు. మరీ వెయ్యంటే.. వెయ్యి మంది సభకు వస్తే అంతస్థాయి ఉన్న వ్యక్తి ఏం మాట్లాడతారు. మాట్లాడినా ఏం ప్రయోజనం.. ఒక వేళ చిన్న సభకు వచ్చినా మీడియాలో వ్యతిరేక వార్తలు వస్తాయి.. దీంతో ఇవన్నీ ఆలోచించి ఎందుకొచ్చిన సమస్యలే అనుకొని ప్రచారం నుంచి సైడ్ అయినట్లు సమాచారం. అయితే తాను హుజూరాబాద్ లో అడుగు పెట్టకపోయినా పార్టీలో నెంబర్ 2 కేటీఆర్ రంగంలోకి దిగుతారు. తండ్రి దిశానిర్దేశంలో ఆయన ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇప్పటికే మంత్రి హరీశ్ రావుతోపాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు క్యాంపెయిన్ చేస్తున్నారు. ఇది పేరుకే ఉప ఎన్నికఅయినా.. టీఆర్ఎస్ పార్టీకి మాత్రం రెఫరెండమే అని చెప్పవచ్చు. అందుకే ఈ ఎన్నికను కారు పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.