చంద్రబాబు ప్లాన్ – బీ?

భూమా అఖిలప్రియ.. మాజీ మంత్రి.. తెలుగుదేశం పార్టీ నాయకురాలు.. తల్లిదండ్రలు అకాల మరణంతో రాజకీయాల్లోకి వచ్చింది. తండ్రి భూమా నాగిరెడ్డి మరణించడంతో ఎమ్మెల్యేగా గెలిచి.. మంత్రిగా కూడా పనిచేశారు. ఆ తరువాత మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీడీపీ అధికారం కోల్పోయింది.. ఈమె మాజీ మంత్రిగా మిగిలింది. అయితే అధికారం లేకపోయినా భూమా కుటుంబానికి కర్నూలు జిల్లాలో హవా ఉండేది. భూమా నాగిరెడ్డి ఒకసారి ఎమ్మెల్యేగా, మూడు పర్యాయాలు ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. ఇక ఆయన భార్య భూమా శోభానాగిరెడ్డి ఎమ్మెల్యేగా, మంత్రిగా సేవలందించారు. ఈ ఇద్దరూ మరణించిన తరువాత జిల్లాలో ముఖ్యంగా ఆళ్లగడ్డ, నంద్యాలలో అఖిల ప్రియ తనకు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకోలేదని పార్టీ అధినేత భావనట. అఖిలప్రియ వ్యవహారంపై చంద్రబాబు కూడా అసంతప్తిగా ఉన్నట్లు తెలిసింది.

ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఏవీ సుబ్బారెడ్డిని ప్లాన్ – బీలో భాగంగా ముందుకు దించుతున్నట్లు సమాచారం. కనీసం కుటుంబంలో కూడా ఐక్యంగా లేరని, ఒక్కొరొక్కరూ పార్టీనీ వీడి వెళ్లిపోతున్నారని, వారికి ఇదే ప్రాధాన్యం ఇస్తే ఇబ్బందే అని పార్టీ అభిప్రాయపడుతోంది. అఖిలప్రియ సోదరుడు బీజేపీలో చురుగ్గా ఉంటున్నాడు. దీంతో కొంతమంది టీడీపీ కార్యకర్తలు బీజేపీలో చేరిపోయారు. ఇక హైదరాబాదులో జరిగిన కిడ్నాప్ కేసు ఉదంతం పార్టీ కొంపముంచేలా ఉందని అనుకుంటున్నారట. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కేసు చర్చనీయాంశమైంది. అంతేకాక అఖిలప్రియ భర్త కూడా పార్టీ వ్యవహారాల్లో తల దూరుస్తున్నాడనే ఆరోపణలున్నాయి. ఇవన్నీ బాగా ఆలోచించిన చంద్రబాబు నాయుడు భూమా కుటుంబానికి దగ్గరగా ఉన్న ఏవీ సుబ్బారెడ్డిని రంగంలోకి దించాలని అనుకుంటున్నట్లు సమాచారం.