మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం చేస్తున్న చిత్రాల్లో `భోళా శంకర్` ఒకటి. తమిళంలో సూపర్ హిట్ అయిన `వేదాళం` మూవీకి ఇది రీమేక్. సిస్టర్ సెంటిమెంట్ ప్రధానంగా సాగే ఈ చిత్రంలో చిరంజీవి చెల్లెలుగా కీర్తి సురేశ్ నటించబోతుంది. అలాగే ఈ చిత్రానికి మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నాడు.
మంచి హిట్స్ లేక, సరైన అవకాశాలు రాక లాంగ్ గ్యాప్ తీసుకున్న మెహర్ రమేష్కు చిరు పిలిచి మరీ ఈ అవకాశం ఇచ్చారు. దాంతో ఈ సినిమాతో ఎలాగైన హిట్ కొట్టి మళ్లీ ఫామ్లోకి రావాలని మెహర్ రమేష్ ఎంతో పట్టుదలతో ఉన్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు మెహర్ రమేష్ పుచ్చుకుంటున్న పారితోషకం ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్గా మారింది. ఈ సినిమాకు రెమ్యూనరేషన్ను ఒకేసారి కాకుండా.. నెల జీతానికి ఆయన పని చేస్తున్నారట.
నెలకు 5 లక్షల చొప్పున జీతం తీసుకుంటున్నాడట. 2020 సెప్టెంబర్లోనే వేదాళం రీమేక్ ప్రీ ప్రొడక్షన్ మొదలు కాగా ఇప్పటి వరకు మెహర్ 60 లక్షలు అందుకున్నాడని, మరో ఏడాదైనా ఈ సినిమా కోసం పని చేయాల్సి ఉంటుంది కాబట్టి మరో 60 లక్షలు ఆయన ఖాతాలో పడనున్నాయని తెలుస్తోంది. అలాగే సినిమా విడుదలైన తర్వాత 20 శాతం వాటా కూడా ఆయన తీసుకుంటారట. మొత్తం మీద రూ.2 కోట్లకు అటు ఇటు ఆయన ఈ మూవీకి తీసుకోబోతున్నారట.