ఏపీలో ఇదే ఇపుడు హాట్ టాపిక్..!

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ (వీఎస్పీ).. ఏపీలో ఇదే ఇపుడు హాట్ టాపిక్.. మోదీ ప్రభుత్వం వీఎస్పీ ప్రైవేటు పరం చేయనున్న నేపథ్యంలో దానిని కాపాడుకోవడానికి.. ముఖ్యంగా రాజకీయ లబ్ధి పొందడానికి పలు పార్టీలు ప్లాన్ వేస్తున్నాయి. మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికే వీఎస్పీ ఉద్యమ కారులకు మద్దతు తెలుపుతూ లేఖ రాయడం.. అధికార పార్టీ కూడా సహకరించాలని..  మా పార్టీ వాళ్లు రాజీనామా చేస్తారు.. వైసీపీ వాళ్లు కూడా చేయాలని పేర్కొన్నారు. అంటే వీఎస్పీ పరిరక్షణకు టీడీపీ అడుగులు వేసినట్లే. అయితే వైసీపీ ఈ విషయంపై పెద్దగా స్పందించలేదు. ఇక కాంగ్రెస్ పెద్దలు మాత్రం ఏకంగా రాహుల్ గాంధీనే రంగంలోకి దించాలనే ప్లాన్ వేస్తున్నారు.  

ఎందుకంటే ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి అధ్వాన్నంగా ఉంది కాబట్టి. చెప్పుకోదగ్గ నాయకుడు కూడా లేడు.  రాష్ట్రంలో ఆ పార్టీ పరిస్థితి దాదాపు జీరో అని చెప్పవచ్చు. అందుకే ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ల సమయముండటంతో వీఎస్పీని ఇష్యూతో ప్రజల మనసు గెలవాలని భావిస్తోంది. అందుకే రాహుల్ గాంధీని కలవడం.. ఆయన సరే అని చెప్పడం జరిగిపోయినట్లు తెలిసింది. ఆగస్టులో రాహుల్ గాంధీ ఏపీలో పర్యటించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంటుకు, కాంగ్రెస్ పార్టీకి అవినాభావ సంబంధముంది. ఎందుకంటే వీఎస్పీకి పునాది పడింది కాంగ్రెస్ పార్టీ హయాంలోనే.. రాహుల్ నాన్నమ్మ ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నపుడే. రాహుల్ పర్యటనతో అయినా  రాజకీయ కార్యక్రమాలు ప్రారంభించవచ్చని ఏపీ కాంగ్రెస్ నేతల అభిప్రాయం.