స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం పుష్ప. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోంది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతోంది.
అలాగే ఈ చిత్రంలో మలయాళీ నటుడు ఫహద్ ఫాజిల్ విలన్గా కనిపించబోతున్నాడు. అయితే ఇక్కడే ఊహించని ట్విస్ట్ ప్లాన్ చేశాడట సక్కూ. లేటెస్ట్ సమాచారం ప్రకారం..పుష్పలో ఫాహద్ కాకుండా మరో నటుడు విలన్ రోల్ లో నటించబోతున్నాడట. ఇంతకీ ఆ నటుడు ఎవరో కాదు.. సునీల్. కమెడియన్గా, హీరోగా మెప్పించిన ఈయన ఆ మధ్య డిస్కో రాజా, కలర్ ఫోటో చిత్రాల్లో విలన్గా కూడా ఆకట్టుకున్నాడు.
ఈ నేపథ్యంలోనే సునీల్ను పుష్పలో పవర్ ఫుల్ విలన్గా చూపించాలని సుకుమార్ భావిస్తున్నారట. ఇక మెయిన్ విలన్ ఫహద్ ఫాజిల్ ఎంట్రీ సెకండ్ పార్ట్లో ఉంటుందని, ఫస్ట్ పార్ట్లో మాత్రం మెయిన్ విలన్గా సునీల్నే చూపించబోతున్నారని ప్రచారం జరుగుతోంది. మరి ఈ ప్రచారమే నిజమైతే.. సుక్కూ ప్లాన్ ఎంత వరకు వర్కోట్ అవుతుందో చూడాలి.