తెలంగాణలో తీవ్ర నైరాశ్యంలో కూరుకుపోయిన కాంగ్రెస్ పార్టీకి రంగారెడ్డి జిల్లా తాండూర్ జీవం పోసింది! కాంగ్రెస్ నేతల్లో వాడిపోయిన ఆశలను చిగురించేలా చేసింది. మునిసిపల్ ఎన్నికల్లో తాండూరులో కాంగ్రెస్ జైత్రయాత్ర కొనసాగించింది. ఇది ఒక రకంగా కాంగ్రెస్కి ఊపురులూదితే.. అధికార టీఆర్ ఎస్లో మాత్రం నైరాశ్యం నింపింది. తాజా పరిణామాలతో కాంగ్రెస్ నేతలు మాంచి జోష్ మీదున్నారు. 2014 ఎన్నికల్లో.. రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ ఘోరంగా సీట్లు కోల్పోయింది. చివరకి బలమైన రాజకీయ కుటుంబానికి చెందిన కార్తీక్ రెడ్డి కూడా ఎంపీగా పోటీచేసి ఓటమిని మూటగట్టుకున్నారు.
మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వర్గానికి చెందిన చాలామంది అధికార పార్టీలోకి జంప్ అయిపోయారు. జిల్లాల పునర్విభజనతో ఇక రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో కాంగ్రెస్ జెండా ఎగరడం కష్టమేనని ప్రచారం జరిగింది. కానీ అనూహ్యంగా తాండూరు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయ ఢంకా మోగించింది. వాస్తవానికి టీఆర్ ఎస్ మంత్రి మహేందర్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే కాంగ్రెస్ విజయం సాధించడం నిజంగా రికార్డనని అంటున్నారు విశ్లేషకులు.
ముఖ్యంగా మహేందర్ రెడ్డితో పాటు సంజీవరావు, కాలె యాదయ్య, ప్రకాశ్ గౌడ్, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, తీగల కృష్ణారెడ్డి లాంటి వారందరూ మొదటి నుంచి టీఆర్ఎస్ లో లేరు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారే. దీంతో టీఆర్ఎస్ నాయకులతో వారికి పొసగడం లేదని టాక్. దీనికి తోడు అధికార పార్టీపై ఉన్న వ్యతిరేకత కూడా తోడవుతోందన్న వాదన వినిపిస్తోంది. టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయ పార్టీ కాంగ్రెస్సే కాబట్టి.. ఇదంతా ఆ పార్టీకే ప్లస్ అవుతుందన్న ప్రచారం జరుగుతోంది.
తాండూరు గెలుపుతో మొదటి అడుగు పడిందని కాంగ్రెస్ నేత సబిత వర్గం చెబుతోంది. ఒక్క అడుగుతో మొదలై రెండు జిల్లాల్లోనూ పూర్వ వైభవం సాధిస్తామని ఆ పార్టీ ఆశిస్తోంది. అయితే వారి ఆశలు నెరవేరుతాయా? లఏదా అన్నది మాత్రం 2019 ఎన్నికలతోనే తేలుతుంది. ఇప్పటికైతే మాత్రం కాంగ్రెస్లో తాండూర్ విజయం గొప్ప జోష్ నింపింది.