కాపుల కోసం జ‌గ‌న్ షాకింగ్ స్కెచ్‌

వ‌చ్చిన అవ‌కాశాన్ని త‌మ‌కు అనుకూలంగా మ‌లుచుకోవ‌డం, రాని అవ‌కాశంలో త‌మ వంతు కోసం వెతుకులాడ‌డం పాలిటిక్స్‌లో నేత‌లు చేసే ప‌ని! ఇప్పుడు ఏపీలోనూ ఇదే త‌ర‌హా రాజకీయాలు న‌డుస్తున్నాయి. 2019లో  ఎట్టిప‌రిస్థితిలోనూ అధికారంలోకి రావాల‌ని గ‌ట్టి ప‌ట్టుద‌ల‌తో ఉన్న ఏకైక విప‌క్ష నేత జ‌గ‌న్‌.. అప్ప‌టి ప‌రిస్థితుల‌ను తాను ఇప్ప‌టి నుంచే స‌ర్దు బాటు చేసుకునేందుకు య‌త్నాల‌ను ముమ్మ‌రం చేశారు. ఈ క్ర‌మంలో అధికార టీడీపీ ఓటు బ్యాంకును చీల్చ‌డంపై పెద్ద ఎత్తున దృష్టి పెట్టిన జ‌గ‌న్‌.. ఆ దిశ‌గా పావులు క‌దుపుతున్న‌ట్టు తెలుస్తోంది.

కాపు ఉద్య‌మ నేత, మాజీ మంత్రి ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం ఉద్య‌మానికి ప్ర‌త్య‌క్షంగా మ‌ద్ద‌తివ్వ‌డంలో జ‌గ‌న్ ఆచితూచి స్పందిస్తున్నారు. అయినా కూడా టీడీపీ నుంచి పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్నారు. ఇదిలావుంటే, ఈ కాపు వ‌ర్గం గుంటూరు, కృష్ణాల్లో టీడీపీకి అనుకూలంగా ఉంది. దీంతో 2014లో వారి ఓట్ల‌న్నీ టీడీపీకి ప‌డ్డాయి. ఇక‌, ఇప్పుడు ఈ వోట్ల‌పై క‌న్నేసిన జ‌గ‌న్‌.. వాటిని చీల్చ‌డం ద్వారా తాను ల‌బ్ధి పొందాల‌ని భావిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే కాపు ప్ర‌ముఖుల‌ను ఆయ‌న ప‌రోక్షంగా ముద్ర‌గ‌డ‌ను క‌లిసేలా ప్రోత్స‌హిస్తున్నారు.

ఇటీవ‌ల డైలాగ్ కింగ్ మోహ‌న్‌బాబు.. భార్యా స‌మేతంగా ముద్ర‌గ‌డ‌ను ఆయ‌న ఇంటికి వెళ్లి మ‌రీ క‌లిసొచ్చారు. అయితే, ఈయ‌న జ‌గ‌న్‌కు అత్యంత స‌న్నిహిత బంధువు కావ‌డం గ‌మ‌నార్హం. అంతేకాదు, గతంలో టీడీపీ టికెట్ చాన్స్ వ‌చ్చినా మోహ‌న్‌బాబు దూరంగా ఉన్నారు. ఇక‌, ద‌ర్శ‌క‌ర‌త్న దాస‌రి నారాయ‌ణ‌రావు సైతం ముద్రగ‌డ‌కు అనుకూలంగా అనేక ప్ర‌క‌ట‌ను గుప్పించారు. కాపు నేత‌లంతా ఆయ‌న వెంటే ఉన్నార‌ని చెప్పారు. ఇక‌, ఈయ‌నను ఏకంగా త‌న పార్టీలోకి రావాల‌ని జ‌గ‌న్ ఆహ్వానిస్తున్నారు. అయితే, స‌మ‌యం, సంద‌ర్భం కోసం దాస‌రి ఎదురు చూస్తున్నారు.

మ‌రోవైపు, మాజీ సీఎం కె రోశయ్య కూడా ఇటీవ‌ల‌ పద్మనాభం ను కలసి “పాత మిత్రుడిని” కలవడానికి వచ్చానని చెప్పారు. అదే సమయంలో ఆయ‌న జ‌గ‌న్‌ను కూడా కలసి “మంచి స్నేహితుడి కుమారుడిని” కలుస్తున్నట్లు తెలిపారు. ఆయన మాటలు కూడా నర్మగర్భంగానే ఉన్నాయి. ఈ పరిణామాలు సహజంగానే టీడీపీలో కలవరం కలిగిస్తున్నాయి. కాపు ఓటర్లలో ఏమాత్రం చీలిక వచ్చినా రాజకీయంగా టీడీపీ చాలా నష్ట పోవలసి వస్తుందని ఆందోళన వ్య‌క్త‌మ‌వుతోంది. మరి ఏం జ‌రుగుతుందో చూడాలి .