రాజకీయాల్లో వేగులు, ఉప్పందించే వారికి ఎప్పుడూ కొదవ ఉండదు! ఇప్పుడు ఇదే టాక్పై తీవ్ర వర్రీ అయిపోతున్నారు తెలంగాణ అధికార పార్టీ టీఆర్ ఎస్ నేతలు. తెలంగాణలోని కేసీఆర్ సర్కారులో ఉన్న మంత్రులే ఏకంగా వేగులు మారిపోయారని ఆరోపిస్తున్నారు. ఈ మంత్రులు ప్రభుత్వం చేయదల్చుకున్న, చేస్తున్న పనులకు సంబంధించిన సీక్రెట్ సమాచారాన్నంతా పోగేసి.. పక్కారాష్ట్ర సీఎం చంద్రబాబుకి చేరవేస్తున్నారట. దీంతో సదరు సమాచారాన్ని ముందే గ్రహిస్తున్న చంద్రబాబు.. తెలంగాణ కన్నా రెండడుగులు ముందుండేందుకు ప్రయత్నిస్తున్నారట! ఇలా మంత్రులే గూఢచారుల్లా మారిపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు తెలంగాణ అధికారుల సంఘం గౌరవాధ్యక్షుడు, ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్. మరి ఈయన ఆరోపిస్తున్న ఆ వేగులు ఎవరో చూద్దామా?!
తెలంగాణ ఉద్యమం ప్రారంభం సమయంలో పెద్ద ఎత్తున రాజకీయ వలసలు సాగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అప్పటి ప్రతిపక్ష టీడీపీ నుంచి కాకలు తీరిన నేతలు సైతం తమ తమ ఉనికిని కాపాడుకునేందుకు గాను సైకిల్ దిగేసి.. కేసీఆర్ నేతృత్వంలోని గులాబీ దళంలోకి చేరిపోయారు. ఇలా చేరినవారిలో టీడీపీలోని పెద్ద పెద్ద నేతలు ఎందరో ఉన్నారు. కడియం శ్రీహరి, తుమ్మల నాగేశ్వరరావు, పోచారం శ్రీనివాసరెడ్డి, జోగు రామన్న, తలసాని శ్రీనివాస యాదవ్ తదితరులు టీడీపీ నుంచి వచ్చి కేసీఆర్ కేబినెట్లో సీటు సంపాదించారు. అయితే, వీరిలో తుమ్మల నాగేశ్వరరావు, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాసరెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్లు చంద్రబాబుకు మంచి దోస్త్లు. గతంలో ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్న సమయంలో చంద్రబాబు కేబినెట్లో వీరు వివిధ శాఖలకు మంత్రులుగా కూడా పనిచేశారు.
ఇప్పుడు, గత పరిచయంతోనే చంద్రబాబుతో ఈ మంత్రులు మంతనాలు సాగిస్తున్నారని తెలంగాణ అధికారుల సంఘం అధ్యక్షుఉడ శ్రీనివాస్ గౌడ్ ఆరోపిస్తున్నారు. వీరంతా చంద్రబాబుకు తోకలేనని, తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నా.. మనసంతా టీడీపీలోనే ఉందని ఆయన బాగానే విమర్శించారు. ఈ నేపథ్యంలో టీఆర్ ఎస్ గవర్నమెంట్ డెసిషన్లన్నీ చంద్రబాబుకు అందించేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ సాఫ్ట్ వేర్ ను కూడా టాంపరింగ్ చేస్తున్నారని కూడా శ్రీనివాస గౌడ్ అన్నారు. ఇది ఎంత వరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. ఇక, ఉద్యోగుల విషయంలో కరాఖండీగా వ్యవహరిస్తున్న చంద్రబాబు.. ఇలా ఒక రాష్ట్రానికి చెందిన రహస్య సమాచారాన్ని దోచుకోవడం నేరం కాదాని ప్రశ్నించారు. మరి శ్రీనివాస్ ఆరోపిస్తున్నట్టు వీరంతా చంద్రబాబుకు వేగులుగా పనిచేస్తున్నారా? ఈ విషయం కేసీఆర్కు తెలిసే జరుగుతోందా? అనేవి సమాధానం లేని ప్రశ్నలుగా మిగిలిపోయాయి.