న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి తాజాగా తన అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. గత కొంతకాలం నుంచి సాయి పల్లవి బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుందని జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. రామాయణం ఇతివృత్తంతో దర్శకుడు నితీష్ తివారి బాలీవుడ్ లో భారీ హంగులతో అంతర్జాతీయ స్థాయిలో త్రీడీ టెక్నాలజీతో ఓ సినిమా రూపొందించబోతున్నారు.
ఈ సినిమాలో రాముడిగా బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ నటించబోతున్నాడు. అలాగే సీత పాత్రలో సాయి పల్లవి అలరించబోతోందని ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. కానీ ఇంతవరకు ఈ విషయంపై అఫీషియల్ ప్రకటన ఏమీ రాలేదు. అయితే తాజాగా సాయి పల్లవి తన బాలీవుడ్ ఎంట్రీని కన్ఫామ్ చేసేసింది. చెన్నైలోని ఓ ప్రైవేటు కార్యక్రమంలో సాయి పల్లవి మాట్లాడుతూ.. రామాయణం అందరికీ తెలిసిందే అని, అయితే నితేశ్ రామాయణాన్ని వినడానికి చాలా ఆతృతగా ఉన్నట్లు పేర్కొంది.
త్వరలోనే కథ వినడానికి ముంబై వెళ్తున్నట్లు స్పష్టం చేసింది. తనలో సీతమ్మని చూసినందుకు నితీశ్ గారికి ఆమె థ్యాంక్స్ చెప్పింది. ఇండియన్ స్క్రీన్పై చాలా రామాయణాలు వచ్చాయి. కానీ వాల్మీకి రామాయణాన్ని ఎవరూ పరిపూర్ణంగా చెప్పలేదు. ఈ సినిమా ఆ లోటును తీరుస్తుందనే ఆశతో ఉన్నానంటూ సాయి పల్లవి చెప్పుకొచ్చింది. ఎందరో లెజెండ్రీ ఆర్టీస్టులు చేసిన సీతమ్మ పాత్ర చేసే అవకాశం రావడం నిజంగా అదృష్టమని సాయి పల్లవి ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేసింది. మొత్తానికి బాలీవుడ్ రామాయణంలో సీతను తానే అని సాయి పల్లవి కన్ఫార్మ్ చేయడంతో.. ఆమె ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోతున్నారు.