సీనియర్ హీరో వేణు తొట్టెంపూడి గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. దాదాపు దశాబ్దకాలం హీరోగా ఓ వెలుగు వెలిగిన వేణు.. 2013లో విడుదలైన రామాచారి మూవీ తర్వాత వెండితెరపై కనిపించలేదు. మళ్లీ పదేళ్లకు రామారావు ఆన్ డ్యూటీ మూవీతో రీఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. అయనప్పటికీ వేణుకు అవకాశాలు వస్తూనే ఉన్నాయి. తాజాగా ఆయన ఓటీటీలోకి అడుగు పెట్టారు.
తొలిసారి అతిథి అనే హర్రర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లో నటించి.. ప్రేక్షకులను పలకరించాడు. ప్రవీణ్ సత్తారు నిర్మాణంలో రూపుదిద్దుకున్న ఈ వెబ్ సిరీస్ కు భరత్ వైజి దర్శకత్వం వహించారు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో సెప్టెంబర్ 19 నుంచి అతిథి స్ట్రీమింగ్ ప్రారంభం అయింది. ఈ నేపథ్యంలోనే మెయిన్ లీడ్ లో నటించిన వేణు.. బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూలు ఇస్తూ తన వెబ్ సిరీస్ ను ప్రమోట్ చేసుకుంటున్నారు.
అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో వేణు మాట్లాడుతూ.. మంత్రి రోజా భర్త, ప్రముఖ దర్శకుడు సెల్వమణి పరువును అడ్డంగా తీసేశాడు. అసలేం జరిగిందంటే.. గతంలో వేణు నటించిన సినిమాల్లో `దుర్గ` ఒకటి. రోజా, వేణు ఈ మూవీలో ప్రధాన పాత్రలు పోషిస్తే.. సెల్వమణి దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నాడు. దుర్గ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అయితే ఈ సినిమాలో కూడా కొన్ని భయపెట్టే అంశాలు ఉంటాయి. ఇదే విషయాన్ని వేణు వద్ద ప్రస్తావించగా .. `ఆ సినిమా గురించి ఇప్పుడు ఎందుకులెండి. అది ఏ జోనర్ అనేది నాకు ఇప్పటికీ అర్దం కాదు. ఆ దర్శకుడు చెప్పింది ఒకటి తీసింది ఒకటి` అని అనేశారు. తన అసహనం మొత్తం బయటపెట్టి డైరెక్టర్ సెల్వమణి పరువు తీసేశాడు. దీంతో వేణు కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.