టీడీపీ-జనసేన పొత్తు ఫిక్స్ అయిన నేపథ్యంలో వైసీపీ శ్రేణుల్లో టెన్షన్ ఉందా? పొత్తు వల్ల తమకు ఏమైనా డ్యామేజ్ అవుతుందని భావిస్తున్నారా? అంటే అబ్బే అలాంటిదేమీ లేదని చెప్పవచ్చు. రెండు పార్టీలు కలిస్తే తమకే ఇంకా లాభమని చర్చించుకుంటున్నారు. గత ఎన్నికల్లో రెండు పార్టీలు విడిగా పోటీ చేయడం వల్ల ఓట్లు చీలి, తమకు లబ్ది చేకూరిన సంగతి వాస్తవమే అని, కానీ ఇప్పుడు కలిసి పోటీ చేసిన కూడా లాభం ఉందని వైసీపీ శ్రేణులు అంటున్నాయి. రెండు పార్టీల పొత్తులో ఓట్లు బదిలీ పూర్తిగా జరిగే ఛాన్స్ లేదని అంటున్నారు.
ఇప్పుడు టిడిపి-జనసేన పొత్తు ఫిక్స్ అవ్వడంతో..నెక్స్ట్ సీట్ల పంపకాలపై చర్చ ఉంటుంది. ఎలాగో ఎక్కువ సీట్లు టిడిపికే దక్కుతాయి. కానీ జనసేనకు ఎన్ని సీట్లు ఇస్తుందనేది ప్రశ్న. జనసేన సైతం సీట్ల కోసం ఎక్కువ డిమాండ్ చేసే అవకాశాలు ఉన్నాయి. తమ బలం పెరిగిందనే వాదించే ఛాన్స్ ఉంది. అటు టిడిపి సైతం అన్నీ సీట్లలో బలంగా ఉంది..దీంతో ఏ సీటు వదులుకోవాలో అర్ధం అవ్వని పరిస్తితి ఉంటుంది.
ఏదేమైనా జనసేనకు మాత్రం కొన్ని సీట్లు వదులుకోవాలి. అలాంటప్పుడు ప్రతి నియోజకవర్గంలో టిడిపికి ఇంచార్జ్ ఉన్నారు. అప్పుడు ఆ ఇంచార్జ్..జనసేనకు సీటు ఇస్తే ఎంతవరకు సహకరిస్తారు..తన మద్ధతుదారులు, టిడిపి శ్రేణులు..జనసేనకు ఎంతవరకు ఓటు వేస్తాయో చెప్పలేం. పైగా జనసేన ఎమ్మెల్యే గెలిస్తే తమపై పెత్తనం చేస్తారని, అది జరగకుండా ఉండాలంటే ఓడించాలనే పాలసీలో ఉండే ఛాన్స్ ఉంది.
ఇదే పాలసీ జనసేనకు వర్తిస్తుంది. జనసేన బలం ఉండి కూడా టిడిపి కోసం కొన్ని సీట్లు వదులుకోవాలి. ఆ సీట్లలో జనసేన ఓట్లు పూర్తిగా టిడిపికి పడతాయా? అనేది పెద్ద ప్రశ్న. మొత్తానికి రెండు పార్టీల మధ్య ఓట్లు బదిలీ అవ్వక..చివరికి వైసీపీకి లాభం అవుతుంది.