విజయవాడ రాజకీయాల్లో వంగవీటి రాధా పోలిటికల్ కెరీర్ లో ఉన్న ట్విస్ట్లు ఇంకా ఎవరికి ఉండవనే చెప్పాలి. అసలు ఆయన రాజకీయంగా ఎటు వైపు వెళుతున్నారు? ఏం చేస్తున్నారు? అనేది క్లారిటీ ఉండటం లేదు. 2004లో తొలిసారి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు..2009లో ప్రజారాజ్యం నుంచి, 2014లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2019 ఎన్నికల ముందు టిడిపిలో చేరారు.
కానీ అప్పుడు పోటీ చేయలేదు. టిడిపి కోసం ప్రచారం చేశారు. అటు టిడిపి ఓడిపోయి అధికారానికి దూరమైంది. అప్పటినుంచి తన తండ్రి రంగా విగ్రహావిష్కరణలకు తప్ప..రాజకీయంగా ఎలాంటి కార్యక్రమాలు చేయడం లేదు. అప్పుడప్పుడు టిడిపి కార్యక్రమాల్లో మెరుస్తున్నారు. అమరావతి పాదయాత్రలో కనిపించిన ఈయన..లోకేష్ పాదయాత్ర మొదలైనప్పుడు కనిపించారు. ఇక తాజాగా లోకేష్ పాదయాత్ర విజయవాడలోకి ఎంట్రీ ఇచ్చింది..ఈ క్రమంలో రాధా..లోకేష్ తో కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు. లోకేష్ పాదయాత్రలో పాల్గొనముందు వరకు రాధా..పార్టీ మారుతున్నారని, జనసేనలోకి వెళుతున్నారని పచారం వచ్చింది.
కానీ ఆయన లోకేష్ని కలిసి పార్టీ మారడం లేదని క్లారిటీ ఇచ్చారు. సరే టిడిపిలోనే ఉంటున్నారు..మరి నెక్స్ట్ ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తారా? పోటీ చేస్తే ఎక్కడ నుంచి పోటీ చేస్తారనేది పెద్ద ప్రశ్నగా మారింది. ఎలాగో విజయవాడ సీట్లు ఖాళీ లేవు. రాధా సొంత సీటు విజయవాడ సెంట్రల్ లో బోండా ఉమా ఉన్నారు..ఈస్ట్ లో గద్దె రామ్మోహన్ ఉన్నారు. వెస్ట్ లో రాధా పోటీ చేయరు. ఆ సీటు ఎలాగో పొత్తులో జనసేనకు దక్కే ఛాన్స్ ఉంది.
పోనీ విజయవాడ ఎంపీ ఖాళీ లేదు. మచిలీపట్నం ఎంపీగా పంపిస్తారా? లేక గోదావరి జిల్లాల్లో ఏదొక సీటులో పోటీ చేయిస్తారా? అనేది క్లారిటీ లేదు. చూడాలి మరి రాధాని చంద్రబాబు ఎక్కడ పోటీ చేయిస్తారో.