ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతుంది. మరో 9 నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఒకవేళ జగన్ ముందస్తు ఆలోచన చేస్తే చెప్పలేం. సరే ఏదేమైనా గాని ఎన్నికల సీజన్ మొదలైంది. ఇక ప్రధాన పార్టీలు గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్నాయి. ఇక సర్వే సంస్థలు వాటి పనిలో అవి ఉన్నాయి. రకరకాల సర్వేలు వస్తున్నాయి. కొన్ని వైసీపీకి అనుకూలంగా..మరికొన్ని టిడిపికి అనుకూలంగా వస్తున్నాయి. అయితే వీటిల్లో జాతీయ సర్వేలు కూడా ఉంటున్నాయి. జాతీయ సర్వేలు దాదాపు వైసీపీకే అనుకూలంగా వస్తున్నాయి.
తాజాగా ఇండియా టీవీ మీడియా ఓ సర్వే విడుదల చేసింది. ఎంపీ సీట్ల విషయంలో రిలీజ్ చేసిన సర్వేలో వైసీపీ 18, టిడిపి 7 ఎంపీ సీట్లు గెలుచుకుంటుందని తేల్చి చెప్పింది. అటు తెలంగాణలో బిఆర్ఎస్-8, బిజేపి-6, కాంగ్రెస్-2, ఎంఐఎం-1 ఎంపీ సీటు గెలుచుకుంటుందని చెప్పింది. అయితే ఏపీలో మొత్తం 25 ఎంపీ స్థానాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో వైసీపీ 22, టిడిపి 3 ఎంపీ సీట్లు గెలుచుకుంది. అయితే ఈ సారి వైసీపీ 18, టిడిపి 7 ఎంపీ సీట్లని గెలుచుకుంటుందని తేల్చింది.
అంటే వైసీపీ 4 ఎంపీ సీట్లని కోల్పోతే..టిడిపి 4 సీట్లని పెంచుకుంటుంది. అయినా సరే వైసీపీకి భారీ ఆధిక్యం చూపించింది. దీని బట్టి చూస్తే అసెంబ్లీ స్థానాల్లో 125 స్థానాలపైనే వైసీపీ గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే ఏపీలో బిజేపి, కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలుచుకోదు అని చెప్పింది. మరి జనసేన ప్రభావం ఉన్నట్లు చెప్పలేదు. ఒకవేళ టిడిపి-జనసేన పొత్తు ఉంటే ఈ లెక్క ఏమైనా మారుతుందేమో చూడాలి. మొత్తానికైతే మళ్ళీ ఏపీలో జగనే అధికారంలోకి వస్తారని తేల్చేసింది.