మెగా డాటర్ నిహారిక గత కొద్ది రోజుల నుంచి వార్తల్లో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. 2020లో జొన్నలగడ్డ చైతన్యను నిహారిక వివాహం చేసుకుంది. అయితే పెళ్లి మూడేళ్లు గడవక ముందే వీరి దాంపత్య జీవితంలో విభేదాలు ఏర్పడ్డాయంటూ వార్తలు ఊపందుకున్నాయి. వీరిద్దరూ విడాకులు తీసుకునేందుకు సిద్ధమయ్యారంటూ బలంగా ప్రచారం జరుగుతుంది.
కానీ ఈ వార్తలను పట్టించుకోకుండా నిహారిక తన పని తాను చూసుకుంటుంది. పెళ్లి తర్వాత ఈమె నటించిన మొట్టమొదటి వెబ్ సిరీస్ `డెడ్ పిక్సెల్స్`. ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ+ హాట్స్టార్ మే 19 నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతోంది. ఆదిత్య మండల దర్శకత్వం వహించిన ఈ సిరీస్ లో నిహారిక కొణిదెలతో పాటు వైవా హర్ష, అక్షయ్ లింగుస్వామి, సాయి రోణక్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో నిహారిక ఫుల్ బిజీగా ఉంది. అయితే ఈ సిరీస్ కు మరింత హైప్ పెంచడం కోసం నిహారిక తన బావ సాయి ధరమ్ తేజ్ సాయం తీసుకుంటుంది.
మే16న హైదరాబాద్ లోని దస్పల్లా హోటల్ లో డెడ్ పిక్సెల్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించేందుకు మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఈవెంట్ కు స్పెషల్ గెస్ట్ గా తేజ్ రాబోతున్నాడు. అయితే ఈ ఈవెంట్ కు తేజ్ తో పాటు నిహారిక భర్త చైతన్య కూడా రావాలని మెగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. గత కొద్ది రోజుల నుంచి నిహారికకు సంబంధించి ఏ ఈవెంట్స్ లోనూ చైతన్య పాల్గొనడం లేదు. ఒకవేళ డెడ్ పిక్సెల్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చైతన్య వస్తే.. డివోర్స్ రూమర్స్ కు చెక్ పెట్టినట్లే అవుతుంది. నెట్టింట వైరల్ అవుతున్న వార్తలు పుకార్లే అని తేలిపోతాయి. మరి మెగా డాటర్ డివోర్స్పై సస్పెన్స్ వీడాలంటే డెడ్ పిక్సెల్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వరకు వెయిట్ చేయాల్సిందే.