`బిచ్చ‌గాడు 2` హీరోయిన్ సాహ‌సం.. ప్రాణాల‌కు తెగించి మ‌రీ అలాంటి ప‌ని చేసిందా?

కావ్య థాపర్.. `ఈ మాయ పేరేమిటో` మూవీతో తెలుగులోకి అడుగు పెట్టి, ఆ త‌ర్వాత త‌మిళ‌, హిందీ భాష‌ల్లో ప‌లు చిత్రాలు చేసింది. రెండేళ్ల క్రితం తెలుగులో మళ్లీ `ఏక్‌ మినీ కథ`లో సంతోష్ శోభ‌న్ కు జోడీగా న‌టించి తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైంది. తాజాగా ఈ బ్యూటీ `బిచ్చ‌గాడు 2` మూవీతో తెలుగు, త‌మిళ ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించింది. 2016లో విడుద‌లైన బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ `బిచ్చ‌గాడు` కు సీక్వెల్ ఇది. ఇందులో విజ‌య్ ఆంటోనీ హీరోగా న‌టించ‌డ‌మే కాదు.. డైరెక్ట‌ర్‌, ప్రొడ్యూస‌ర్ గా కూడా వ్య‌వ‌హ‌రించాడు.

అలాగే కావ్య థాపర్ హీరోయిన్ గా న‌టించింది. బ్రెయిన్ మార్పిడి అనే ప్ర‌యోగాత్మ‌క పాయింట్‌తో యాక్ష‌న్ అంశాలు మ‌రియు చెల్లెలు సెంటిమెంట్ ను జోడించి ఈ మూవీకి తెర‌కెక్కించారు. మే 19న‌ తెలుగు, త‌మిళ భాష‌ల్లో రిలీజ్ అయిన ఈ సినిమా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుని అదిరిపోయే ఓపెనింగ్స్ రాబ‌ట్టింది. ఇక‌పోతే ఈ సినిమా షూటింగ్ స‌మ‌యంలో విజ‌య్ ఆంటోనీ ప్ర‌మాదానికి గురైన సంగ‌తి తెలిసిందే.

అయితే ఆ స‌మ‌యంలో విజ‌య్ ను హీరోయిన్ కావ్య‌నే సాహసం చేసి మ‌రీ ర‌క్షింద‌ట‌. ఈ విష‌యాన్ని ప్ర‌మోష‌న్స్ లో విజ‌య్ ఆంటోనీ ప‌లు మార్లు వెల్ల‌డించాడు. అస‌లేం జ‌రిగిందంటే.. షూటింగ్ స‌మ‌యంలో ఓ పెను ప్ర‌మాదం జ‌రిగింద‌ట‌. దాంతో విజయ్ అపస్మారక స్థితిలో బోట్ నుంచి సముద్రంలో పడిపోయార‌ట‌. అయితే ఆయన్ని రక్షించాలనే తపనతో ప్రాణాల‌కు తెగించి మ‌రీ కావ్య కూడా సముద్రంలో దూకేసింద‌ట‌. ఈత కొడుతూ వెళ్లి ఆయన్ని పట్టుకుంద‌ట‌. `ఆ సమయంలో నేను కూడా మరణం అంచుల దాకా వెళ్లినట్టు అనిపించింది. మా పరిస్థితి గమనించిన వెంటనే యూనిట్ మ‌మ్మ‌ల్ని రక్షించారు. ఆ ఘటనను ఇప్పుడు తలుకున్నా చాలా భయం వేస్తోంది. ఆ ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో నా ముఖానికి గాయాలు కూడా అయ్యాయి` అంటూ తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో కావ్య థాప‌ర్ చెప్పుకొచ్చింది. దీంతో కావ్య సాహ‌సాన్ని నెటిజ‌న్లు మెచ్చుకుంటున్నారు.