జగన్ ‘సీఎం’ యాగం.. మళ్ళీ గెలిచేస్తారా?

రాష్ట్ర అభివృద్ధిని ఆకాంక్షిస్తూ..ఆరు రోజుల పాటు మహాయాగం నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈ యాగం నిర్వహించనున్నారు. మొదటి రోజు, చివరి రోజు జరిగే రాజశ్యామల యాగంలో జగన్ పాల్గొననున్నారు. ఈ యాగం ఖర్చు మొత్తం ఏపీ ప్రభుత్వమే భరిస్తుంది. ఇక నేడు యజ్ఞ క్రతువును సీఎం జగన్ ప్రారంభిస్తారు. 108 కుండాలతో, నాలుగు ఆగమనాలతో, 500 మంది రుత్విక్కులతో మహాయజ్ఞం నిర్వహిస్తున్నారు.

రాష్ట్ర సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం వైసీపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో రాజశ్యామల యాగం చేయాలని నిర్ణయించినట్లు దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యానారాయణ చెప్పుకొచ్చారు. ఇక ప్రధాన ఆలయాలకు చెందిన దేవతామూర్తుల కల్యాణ ఉత్సవాలు నిర్వహించనున్నారు. పూర్ణాహుతితో మహాయజ్ఞం ముగియనుంది. అయితే రాష్ట్ర అభివృద్ధి కోసం యాగమని చెబుతున్నా సరే..ఇది జగన్ మళ్ళీ సి‌ఎం అవ్వడానికి చేయిస్తున్నా యాగం అని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.

అయిన సొంత ఖర్చులతో చేయకుండా, ప్రభుత్వ ఖర్చులతో యాగాలు చేయడం ఏంటని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఇదిలా ఉంటే గతంలో తెలంగాణలో కే‌సి‌ఆర్ సైతం రాజ శ్యామల యాగం చేసాకే సి‌ఎం అయ్యారని, ఇప్పుడు జగన్ చేస్తున్నారని, కాబట్టి మళ్ళీ ఆయన సి‌ఎం అవుతారని వైసీపీ వర్గాలు అంటున్నాయి. దీంతో ఈ యాగంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ నడుస్తుంది. మరి దీన్ని ప్రజలు ఎలా తీసుకుంటారో చూడాలి.